తెలంగాణలో బీఆర్ ఎస్(BRS) కు ఎన్నికల వేళ షాక్ మీద షాక్ తగులుతోంది. కీలక వికెట్లన్నీ ఎన్నికలకు ముందు చేజారి పోతుండటం బీఆర్ ఎస్ పార్టీకి గట్టి దెబ్బగా పరిణమించబోతున్నాయి. సీనియర్లు గెలిచే సత్తా ఉన్నవారు పార్టీకి హ్యాండ్ ఇవ్వడం బీఆర్ ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.తాజాగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి పార్టీకి గుడ్ బై కొట్టేశారు. తనకి టిక్కెట్ ఇచ్చినా తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడం ఆయన కలతకు కారణం. తనకు, తన కుమారుడు ఇద్దరికీ ఆయన టిక్కెట్ ఆశించారు.అయితే సమీకరణాలు కుదరక ఆయనకు మాత్రమే టిక్కెట్ ఇచ్చింది బీఆర్ ఎస్. దాంతో ఆయన అలిగి కూర్చున్నారు. ఆయనలో అసమ్మతి రాగం ఉందని తెలుసుకున్న కాంగ్రెస్ ఆయనకు గాలం వేసింది. ఆ గేలానికి మైనంపల్లి చిక్కారు.
కుమారుడిని తెమ్మని కేసీఆరే చెప్పారు (BRS)
కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైనంపల్లి నిన్న కార్యకర్తలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపై కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపేశారు. తాను మల్కాజ్ గిరి నుంచే మళ్లీ బరిలోకి దిగుతానని తేల్చేశారు. తన కుమారుడిని పాలిటిక్స్ లోకి తెమ్మని కేసీఆరే చెప్పారని తీరా టిక్కెట్ ఇవ్వకపోవడం ఏంటని ఆయన మండి పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ తీర్ధం తీసుకోవాలని నిర్ణయించారు. తనకు పదవులకన్నా కార్యకర్తలే ఎక్కువని, తనకోసం రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలందరిపైనా కేసులు బనాయించారని మండి పడ్డారు.నియోజక వర్గానికి కూడా ఎప్పుడూ రాని నేతలు సైతం తనను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. అన్ని సర్వేల్లోనూ తానే నెంబర్ వన్ అని తన గెలుపు ఖాయమని మైనంపల్లి ధీమాగా ఉన్నారు. రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ లో చేరికల వేవ్
ఎవరి మాటెలా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం జోరుమీద ఉంది. ప్రజల్లో పెరుగుతున్న పాజిటివ్ వేవ్.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లో బాగా ప్రచారం పొందాయి. కేసీఆర్ పై పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణమైనా ఆశ్చర్యంలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ వైపే చోటా, బడా నేతలు చూస్తున్నారు. ఇప్పటికే నోముల వీరేశం , తుమ్మల నాగేశ్వర రావు,జూపల్లి, పొంగులేటి తదితరులు కొన్నాళ్ల క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ ఎస్(BRS) లో నాయకుల తిరుగుబాట్లు ఒకవైపు, మళ్లీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరోవైపు పుంజుకుంటున్న కాంగ్రెస్ అన్నీ కలిసి బీఆర్ ఎస్ ను మరింత డీలా పడేలా చేస్తున్నాయి. అందరికన్నాముందే సీట్ల కేటాయింపు ప్రకటించిన బీఆర్ ఎస్ ఎన్నికల నాటికి అసమ్మతి లుకలుకలు సర్దుకుంటాయని భావించింది. కానీ అవి అంతకంతకూ పెరిగిపోతుండటం, కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై కొట్టడం జరిగిపోతున్నాయి.
హాట్రిక్ కోసం కేసీఆర్ చూస్తుంటే. ప్రభుత్వ వ్యతిరకత పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. టిక్కెట్ల కేటాయింపులో రేగిన అసమ్మతి జ్వాలలను చల్లార్చడం అధినేత వల్ల కావడం లేదు.
బీఆర్ ఎస్ కోలుకుంటుందా? (BRS)
టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చి ఆ పార్టీ పెద్ద తప్పు చేసిందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ అంతర్గత వర్గాలు. జాతీయ స్థాయిలో పోరాడే సత్తా బీఆర్ ఎస్ కు ఎలాగూ లేదు.. సొంత రాష్ట్రంలోనే రేగుతున్న అసమ్మతి సెగలను అదుపు చేయలేకపోతున్నారు. సొంత రాష్ట్రంలోనే దిక్కులేదు.. ఇక జాతీయ స్థాయిలో ఏం పోరాడతారంటూ విపక్షాలు విమర్శిస్తున్నా బీఆర్ ఎస్(BRS) నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఎన్నికలు తరుముకొస్తుంటే కేసీఆర్ కు చీమ కుట్టినట్లయినా లేకపోవడం బీఆర్ ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది.
ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఈసీ కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా బీఆర్ ఎస్ మాత్రం తిరుగుబాట్లు, అసమ్మతి జ్వాలలనుంచి కోలుకోటం లేదు.