CBN
120 ప్రశ్నలు.. 9 మంది అధికారుల బృందం, అందులోంచి గంటకు ఇద్దరు చొప్పున మూడు గంటల పాటు విచారణ .. ఆపై చంద్రబాబుకు లంచ్ విరామ సమయం.. ఆ తర్వాత మరో మూడు గంటల పాటు ప్రశ్నల వర్షం.. కొద్ది దూరంలో చంద్రబాబు న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ పర్యవేక్షణ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు తొలిరోజు సీఐడీ ఇంటరాగేషన్ జరిగిన తీరిది. మొత్తం ఏడు గంటల పాటు చంద్రబాబును సీఐడీ విచారించింది. బాబు ఖైదీగా ఉన్న స్నేహ బ్యారక్ దగ్గరలో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో ఈ విచారణ జరిపారు.
స్కిల్ స్కామ్ పై గుచ్చి గుచ్చి ప్రశ్నలు CBN
స్కిల్ స్కామ్ లో సీఐడి ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను చంద్రబాబు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సీమెన్స్ మాజీ ఎండీ, డిజైన్ టెక్ సంస్థ అధినేతలతో సంబంధాలపై ఆరా తీశారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ఆగ మేఘాల మీద ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రమేయంపై సీఐడీ ప్రధానంగా ఇంటరాగేట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదనపు సమాచారాన్ని కూడా ముందు పెట్టుకుని అధికారులు ప్రశ్నలు సంధించారు.కొన్ని కీలక ఫైళ్లను ఆయన ముందుంచినా సమాధాన మిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారని తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు చంద్రబాబు ముభావంగా ఉండిపోయారని సమాధానాలు దాట వేసినట్లు వార్తలు వస్తున్నాయి.లోకేష్, కిలారి రాజేష్, పీఏ శ్రీనివాస్ ల ప్రమేయంపైనా ఆరా తీసినట్లు సమాచారం.
ఇంటి భోజనానికి అనుమతి CBN
అంతకుముందు నిర్దేశించిన సమయానికే చంద్రబాబును విచారించే సీఐడీ బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత సీఐడీ టీమ్ ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టింది. విచారణ మధ్యలో గంటకు ఒకసారి ఐదు నిమిషాలపాటు ఆయనకు రెస్ట్ ఇచ్చారు. ఈ టైమ్ లో ఆయన తన న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు అనుమతించారు. . మూడు గంటల విచారణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇంటినుంచి కుటుంబ సభ్యులు భోజనం పంపించడంతో దానినే చంద్రబాబు తిన్నారు. భోజనం తర్వాత గంట పాటు రెస్ట్.. తర్వాత సీఐడి అధికారులు మళ్లీ తమ ఇంటరాగేషన్ కొనసాగించారు. మరో మూడు గంటలు నిరాటంకంగా చంద్రబాబు ఇంటరాగేషన్ కొనసాగింది. చంద్రబాబు స్టేట్ మెంట్ ను కూడా ఈ సందర్భంగా రికార్డు చేశారు. విచారణ ను సీఐడీ బృందం వీడియో రికార్డింగ్ చేసింది.
అందుబాటులో ప్రత్యేక వైద్యుల బృందం
చంద్రబాబు ఆరోగ్య అవసరాల రీత్యా ప్రత్యేక అధికారిని నియమించారు. జైలు వరణలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఉంచారు. కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అత్యవసరమైతే చంద్రబాబు బ్లడ్ గ్రూప్ ను కూడా సిద్దంగా ఉంచారు. ఎమర్జెన్సీ అవసరానికి అందుబాటులో చంద్రబాబు కాన్వాయ్ ను కూడా సిద్ధం చేసి జైలు గేటు ప్రాంగణంలో ఉంచారు.
క్యాంప్ లో ఉండి పర్యవేక్షణ
మరోవైపు భువనేశ్వరి, బ్రహ్మణి, లోకేష్ క్యాంప్ లో ఉండి విచారణా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. టీడీపీ నేతలు బ్రహ్మణి, భువనేశ్వరిలను పరామర్శించారు. బాలయ్య మాత్రం టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే పరిస్థితిని సమీక్షించారు. ఇక చంద్రబాబు జైలుకెళ్లిన నాటినుంచి ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్ కూడా అక్కడినుంచే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.