YCP
దేవుని దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానంటూ పదే పదే చెప్పే ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రజల మధ్యకు వెళుతున్నారు. చంద్రబాబు అరెస్టు వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.టీడీపీ, జనసేన కలసి ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించడం, మరోవైపు బీజేపీ వారితో కలుస్తుందో లేదో తెలీని పరిస్థితి. అయితే తనకు దత్త పుత్రులు, ఉత్త పుత్రులు లేరని, సపోర్ట్ చేసే మీడియా కూడా లేదని కామెంట్ చేసే జగన్ తానెన్నడూ ప్రజలనే నమ్ముకున్నానంటూ ఉంటారు. అందుకే మరోసారి ఆ ప్రజల మధ్యకే వెళ్లి వారితో మమేకమవ్వాలని నిర్ణయించారు. అందుకే ప్రజాశీర్వాద యాత్ర పేరుతో మళ్లీ ఆయన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో టీడీపీ సానుభూతి రాజకీయాలకు పాల్పడుతోందని భావిస్తున్న వైసీపీ అప్రమత్తమైంది. అసలు ఆ స్కామ్ వివరాలను ప్రజలకు సులభమైన రీతిలో అర్ధమయ్యేలా వివరించడమేకాక తమ ప్రభుత్వం చేసే మంచి పనులు, పథకాలను ప్రజలకు తెలిసేలా మరోసారి ప్రచారం చేయాలని వీటిని సీఎం జగనే స్వయంగా చేయాలని పార్టీ నిర్ణయించింది. అందుకే జగన్ నేరుగా జనం మధ్యకే వెళ్లి చంద్రబాబు స్కామ్ వివరాలను పూస గుచ్చినట్లు వివరిస్తారని తెలుస్తోంది. ప్రజల మధ్య ప్రతిపక్షాలను టార్గెట్ చేసి పదునైన విమర్శలతో ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబుస్కామ్ పై వివరణాత్మక ప్రచారం
మరోవైపు టీడీపీ అధినేత అరెస్టుతో ఆ పార్టీ చెట్టు కొకరు,పుట్టకొకరు గా అయిపోయారు. ఈ శూన్యతను ఉపయోగించుకోవాలని వైసీపీ(YCP) రాజకీయ వ్యవహారాల కమిటీ భావిస్తోంది. చంద్రబాబు అవినీతి చేసే జైలుకు వెళ్లారు తప్ప ఇందులో రాజకీయ కక్ష అన్నది లేదన్నది ఇప్పటికే అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ బహిరంగ సభల్లో తమ ప్రభుత్వం చేసే పనులను ప్రస్తావించడంతోపాటు మంచి అభ్యర్ధులను ఇప్పటికే నిర్ణయించిన అభ్యర్ధులను ప్రజలకు పరిచయం చేస్తారు.
వచ్చే నెల మొత్తం ప్రజల మధ్యనే… (YCP)
ఈనెలాఖరుకు అసెంబ్లీ ముగుస్తుండటంతో వచ్చే నెల అంతా ప్రజల మధ్యనే జగన్ ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే సర్వేలు పూర్తయి గెలుపు గుర్రాల లిస్టు రెడీ అవడంతో ఇక వారిని పరిచయంచేసి ప్రజల వద్దకు వదలాలని భావిస్తున్నారు. తనకు ఎవరితోనూ పొత్తు ఉండదని, ఆ అవసరం లేదని,తనకు నేరుగా ప్రజలతోనే పొత్తు అని జగన్ ఇప్పటికే ప్రకటించారు. జిల్లాల పర్యటన చేస్తూ నియోజక వర్గాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. తమ పార్టీ అభ్యర్ధులనే కాదు..ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులెవరుండొచ్చు అన్న దానిపైనా ఆరా తీసి తదనుగుణంగా సామాజిక, ఆర్థిక,స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేస్తారు.
సంక్షేమ పథకాలే అండగా…
తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలనే ముందు పెట్టి జగన్ ప్రచారం ఉండబోతోంది. తాను తొలినుంచీ నమ్ముకున్న ఓటు బ్యాంకును, తనను విశ్వసించే వర్గాలను మరోసారి తమ వైపే మొగ్గు చూసేలా చేసుకోవాలని, ప్రతిపక్షానికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా దూకుడు పెంచాలని జగన్ భావిస్తున్నారు.పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు, సమస్యలు, లోపాలు ఉంటే ఇప్పటినుంచి సరిదిద్దుకుని, ఎన్నికలెప్పుడు జరిగినా సంసిద్ధంగా ఉండాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.