TS
తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేసీఆర్ మధ్య మళ్లీ కోల్డ్ వార్ రాజుకుందా? గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ తమిళిసై మోకాలడ్డటం చూస్తుంటే అదే అభిప్రాయం కలుగుతోంది. గతంలో పాడి కౌశిక్ అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించడంతో మొదలైన గొడవ అనేక మలుపులు తిరిగింది.రాజ్ భవన్ కు ప్రతిగి భవన్ కు మధ్య దూరం పెరిగింది. అధికారిక కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం, కేంద్ర మంత్రులు వస్తే తాను హాజరు కాకపోవడం ద్వారా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై కక్ష తీర్చుకున్నారు. అప్పటినుంచి రెండు కేంద్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత కోల్డ్ వార్ జరిగింది. తనను సరిగా ట్రీట్ చేయడంలేదంటూ ఢిల్లీ వెళ్లి మరీ తమిళి సై మోడీకి, అమిత్ షాకి కంప్లయింట్ చేశారు.
రిపబ్లిక్ డే వేడుకలు, పంద్రాగస్టు వేడుకలు కూడా ఎవరికి వారు విడి విడిగా చేసుకున్నారు తప్ప ఇద్దరూ కలసి ఉమ్మడిగా పాల్గొనలేదు. అలాంటిది ఈమధ్య ఒకానొక ఫంక్షన్ లో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. తాజాగా నామినటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించడం పై బీఆర్ ఎస్ లో అసహనం కట్టలు తెంచుకుంది. కేబినెట్ చేసిన సిఫారసులను తొక్కి పట్టారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా రిఫర్ చేస్తూ కేబినెట్ గవర్నర్ కు లేఖ పంపింది. అయితే వీరిద్దరికీ నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఉండల్సిన అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం ఈ అర్హతలు సరిపోవని అన్నారు.
అర్హులకు అన్యాయం కాదా? TS
ఎమ్మెల్సీ అర్హతలున్న ఎందరో రాష్ట్రంలో ఉండగా వారందరినీ కాదని వీరిని సిఫార్సు చేయడం ఏంటని గవర్నర్ కామెంట్ చేశారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారి పేర్లను సిఫారసు చేయడం సరైన పద్ధతి కాదని వీరిని నియమిస్తే ఆయా రంగాల్లో నాలెడ్జ్, అనుభవం ఉన్నవారికి అన్యాయం చేసినట్లవుతుందని గవర్నర్ అన్నారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయాలన్న దానిపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా చెబుతోందంటూ కామెంట్ చేశారు తమిళిసై.రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని ఈ సందర్భంగా మంత్రి మండలి, ముఖ్యమంత్రికి సూచించినట్లు గవర్నర్ పేర్కొన్నారు.
మరి మీరు గవర్నర్ గా ఉండొచ్చా? గవర్నర్ ఇలా రెండోసారి తన విచక్షణాధికారం పేరిట నిర్ణయాలను అడ్డుకోవడంపై బీఆర్ ఎస్ నేతలు మండి పడ్డారు.
ఇంద్రకరణ్, వేముల ఫైర్
మంత్రి ప్రశాంత్ రెడ్డి అయితే మరోసారి నోరు పారేసుకున్నారు. అసలు ఈగవర్నర్ గవర్నర్ పదవికే అర్హురాలు కాదు.. తమిళనాడులో బీజేపి అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్ గా నామినేట్ అయిన ఆమె కూడా ఆ పదవికి అర్హురాలు కారని మండిపడ్డారు. తక్షణం ఆమె నైతిక విలువలకు లోబడి గవర్నర్ పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తమిళి సై చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామెంట్ చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్ ఆమోదించకపోవడం రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గవర్నర్లు వ్యవహరించరాదని, గతలో ఏ గవర్నర్ ఇలా చేయలేదని అన్నారు. ఎన్టీ, బీసీ సామాజిక వర్గాల వారి పట్ల ఇలా వ్యవహరించడం అన్యాయమన్నారు.గవర్నర్లకు రాజకీయ నేపధ్యం ఉండొచ్చు గానీ, ఎమ్మెల్సీలకు ఉండకూడదా అని ఆయన ఫైర్ అయ్యారు.