(IRR)
అమరావతి రాజధాని స్కాముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ తయారీలో మార్పులు చేసి క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేష్ మరికొందరితో కలసి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సీఐడి అభియోగాలు నమోదు చేసింది. అలైన్ మెంట్ మార్పుల వల్ల వారి భూములకు ధరలు ఆకాశాన్నంటే విధంగా మాస్టర్ ప్లాన్ వేయడంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని సీఐడీ తెలిపింది.
ఇప్పటికే స్కిల్ స్కామ్ తో పాటు, ఫైబర్ నెట్ కేసులోనూ నిందితుడిగా ఉన్న లోకేష్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఏ14గా నమోదయ్యారు. క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం చేకూర్చారని అందుకు ప్రతిగా కరకట్ట దగ్గర లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు వ్యక్తిగతంగా నే నివాసంగా ఉచితంగా పొందారని సీఐడీ ఆరోపిస్తోంది.
అంతా బాబు కనుసన్నల్లోనే : సీఐడీ
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందన్నది సీఐడీ చేస్తున్న ఆరోపణలు. అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన టైమ్ లో CRDA ఎక్స్ అఫీషియో ఛైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు. ఆనాడు రింగు రోడ్ మాస్టర్ ప్లాన్ పై చివరి నిర్ణయం తీసుకున్నది కూడా చంద్రబాబే.
మూడు సార్లు అలైన్మెంట్ మార్పు
ఇన్నర్ రింగ్ రోడ్(IRR) అలైన్ మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేష్ కుటుంబానికి, చంద్రబాబుకు, నారాయణకు మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తోంది సీఐడి. చంద్రబాబు హయాంలో అలైన్ మెంట్ ను మూడుసార్లు మార్చారు.2015జులై22, 2017 ఏప్రిల్4, 2018 అక్టోబర్ 31న అలైన్ మెంట్ లో మార్పులు జరిగాయి. ఇదే కేసులో ఏ-3గా ఉన్న లింగమనేని రమేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సంబంధం లేకుండా ఆయన కుటుంబానికి ప్రయోజనం కలిగించే రీతిలోనే అలైన్ మెంట్ ను మార్చారన్నది దర్యాప్తులో తేలింది. రాజధాని మాస్టర్ ప్లాన్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో క్విడ్ ప్రోకోలో భాగంగానే కృష్ణానది భూముల్లో కరకట్ట దగ్గర ఇంటినిర్మాణం సాగింది. ఆ ఇంటినే చంద్రబాబుకు నివాసంగా లింగమనేని రమేష్ కట్టబెట్టారు. అది క్విడ్ ప్రోకోలో భాగంగానే జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.
నారాయణకు అన్నీ ముందే తెలుసు (IRR)
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులన్నీ నారాయణకు ముందే తెలుసునని సీఐడి ఆరోపిస్తోంది. అప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సీడ్ క్యాపిటల్ లో భూముల కొనుగోలు చేశారనడానికి సీఐడి దగ్గర ప్రాథమిక ఆధారాలున్నాయి. సీడ్ క్యాపిటల్ లో భూములు ముందే కొనేసి,ఆపై వాటిని సీఆర్ డీఏ భూ సమీకరణ కింద ఇచ్చి 75,888 చదరపు గజాల ప్లాట్లు నారాయణ ఫ్యామిలీ పొందారు. ఈఆస్తులను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతించింది.