కోతిలోంచి పుట్టాడు మానవుడు..అని ఓ పాట ఉంది.. నిజానికి ఆది మానవుల పూర్వ రూపం కోతులేనంటారు. అలాంటి కోతులు, కొండముచ్చులు (Langur) మనుషుల్లా బిహేవ్ చేస్తే.. ఈ డిజిటల్ యుగంలో అవి కూడా ఉద్యోగాలకు ఎగబడితే.. వామ్మో సీన్ సితారవుతుంది. అసలు నిరుద్యోగంతో అల్లాడుతున్న మన దేశంలో ఇప్పుడు కోతులు, కొండముచ్చులు కూడా ఉద్యోగాలకు బయల్దేరితే ఇక చెప్పేదేముంది అంటున్నారు నెటిజన్లు. తాజాగా ఓ కొండముచ్చు కంప్యూటర్ ముందు కూర్చుని చాలా పద్ధతిగా ఆపరేట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చు మనిషిలాగే కంప్యూటర్ సిస్టం ముందు కూర్చుని టైప్ చేయడమేకాదు..కొన్ని రికార్డులు , ఫైళ్లు పేపర్లు కూడా తిరగేసి పరిశీలించింది. చాలా కాలంగా అక్కడ ఉద్యోగుల కదలికలు పరిశీలిస్తూ వచ్చిందేమో తాను కూడా అనుభవజ్నురాలిలాగా ఆపరేట్ చేసింది. ఆ వీడియో క్లిప్ లో కొండముచ్చు చుట్టూ గుమి కూడి స్థానిక సిబ్బంది నవ్వడం కూడా కనిపిస్తోంది. అంతేకాదు.. కోతి గారి నైపుణ్యానికి కితాబు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయిన ఈ షార్ట్ వీడియోకి మూడు వేల వ్యూస్, వేలల్లో లైక్ లు కూడా వచ్చాయి. యూజర్లు ఈవీడియోని చూసిన వెంటనే కామెంట్ సెక్షన్ లో ఓ రేంజ్ లో రియాక్టయ్యారు.లాఫింగ్ ఎమోజీలు పెట్టడమే కాదు..
చిత్ర విచిత్రమైన వ్యాఖ్యానాలు చేశారు (Langur)
అబ్బో టెక్కీ సావీ కొండముచ్చు (Langur) గారి గురించి మాట్లాడండి అంటూ ఒకరు కామెంట్ చేస్తే, కొత్త స్టేషన్ మాస్టర్ గారొచ్చారు అంటూ మరొకరు రాశారు. ఇక కోతిలోంచి వచ్చాడు మానవుడు అనడానికి ఇంతకన్నా ఏం ఆధారం కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఉద్యోగాలలో సరికొత్త పోటీ అని ఒకరు కామెంట్ చేస్తే పర్లేదు, మనుషులతో సమానంగా కోతులు, కొండముచ్చులు కూడా మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, ట్రెండ్ ఫాలో అవుతున్నాయని మరొకరు కామెంట్ చేశారు.
ఇంతకీ ఈ వీడియో ఎక్కడిదో తెలుసా?
పశ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వే స్టేషన్ ఎంక్వయిరీ ఆఫీస్ లో ఈ సంఘటన జరిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఇది నిజంగా అక్కడిది అవునా కాదా అన్నది మాత్రం తెలియలేదు. కోతులు డిజిటల్ లిటరసీ ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. మనుషులు వాడే పరికరాలు , ఉత్పత్తులు అవి కూడా వాడటం చాలా సార్లు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్లను అలవోకగా వాడేసే కోతులను మనం చూస్తుంటాం.
ఈఫన్నీ వీడియో చూశాక కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కూడా మరో వీడియోను పోస్ట్ చేశారు. మన దేశంలో డిజిటల్ లిటరసీ ఊహించనంత స్థాయికి చేరింది. అందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని రాసుకొచ్చారు. ఇంతకీ రిజిజు పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే మూడు కోతులు చుట్టూ చేరి వీడియోలను స్క్రోల్ చేసి చూస్తున్నాయి.