కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం BJP యాక్షన్ ప్లాన్ లో భారీ మార్పులు చేసింది. సమష్టి నాయకత్వంతో, మోడీని ముందు పెట్టి మాత్రమే ఈసారి ఎన్నికలకు వెళ్లాలని బీజేపి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోఈసారి రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్ధులను ఎన్నికలకు ముందు ప్రకటించరాదని హై కమాండ్ భావిస్తోంది. వ్యక్తికన్నా పార్టీ ముఖ్యం అన్న భావనను కలిగించడానికి, స్థానిక నేతలు కసిగా పనిచేసి గెలవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో బడా నేతలను నిలపడం ద్వారా, మోడీ అపీల్ తో ఈసారి ఎన్నికలు కూడా సునాయాసంగా గెలిచి హ్యాట్ ట్రిక్ సాధిస్తామనే నమ్మకంతో బీజేపి శ్రేణులు ఉన్నాయి.
ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందే ప్రకటించకపోవడం వల్ల అందరూ పోటీ పడి ఉత్సాహంగా పనిచేస్తారని సీనియర్లు భావిస్తున్నారు.రాజకీయాల్లో బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాలే అస్త్రాలుగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహంతోనే ఈసారి ఎన్నికలకు బీజేపీ సిద్ధపడుతోంది. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించింది. బీజేపీ ఎంత ప్రయత్నించినా దక్షిణాదిన కాలు పెట్టలేకపోతోంది. కర్ణాటకలో నయానోభయానో అధికారంలోకి వచ్చినా దానిని నిలబెట్టుకోలేక అభాసుపాలవుతోంది. ఇక తమిళనాడు, కేరళ, ఏపీలలో అయితే అడుగు పెట్టే అవకాశమే లేదు. అందుకే ఈసారి తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
బీజేపీ పైకి చెప్పకపోయినా కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే పార్టీ చీఫ్ గా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అందించారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను, ధర్మపురి ఎంపీ అర్వింద్ కుమార్ పేర్లను కూడా సీఎం అభ్యర్ధిత్వానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఓబీసీ నేతకు అవకాశం కల్పిస్తే డాక్టర్ లక్ష్మణ్ పేరును పరిశీలించే ఛాన్స్ ఉంది.
ఇక ఎన్నికలెదుర్కొంటున్న మిజోరం కూడా బీజేపీకి కత్తిమీద సామే. కారణం పొరుగు రాష్ట్రమైన మణిపూర్ లో జాతి పరమైన హింసకాండ కొనసాగుతుండటం ఆ ప్రభావం మిజోరంపై కూడా పడే అవకాశముంది.
అసెంబ్లీ బరిలో మంత్రులు, ఎంపీలు BJP
ఎన్నికలకు వెడుతున్న మధ్య ప్రదేశ్ లో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస వర్గీయ ఈసారి అసెంబ్లీకి నిలబడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మాత్రం ఈసారి అవకాశం ఉండకపోవచ్చు. ఈసారి అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలను నిలబెట్టడం అంటే వారికి పార్టీ సమష్టి నాయకత్వ లక్ష్యాన్ని తెలియ చేయడమేనని బీజేపి అంటోంది. కాంగ్రెస్ పై గెలుపు సాధించాలంటే బెస్ట్ టీమ్ బరిలో ఉండాలని బీజేపి నాయకత్వం భావిస్తోంది. మరికొందరు వృద్ధ నేతలకు కూడా సీట్లు మార్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తిస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో గెలవాలన్న పట్టుదలతో బీజేపి అడుగులు వేస్తోంది.రాజస్థాన్ సీఎం అభ్యర్ధిగా గజేంద్ర సింగ్ షెకావత్,అర్జున్ రాం మేఘవాల్ ల పేర్లు వినిపిస్తుండగా రేసులోరాజ్య సభ ఎంపీ కిరోడి లాల్ మీనా,లోక్ సభ ఎంపీ దియాకుమార్,రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్ జాన్ పురియాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
బీజేపీలో అత్యంత సీనియర్ అయిన వసుంధర రాజేను మాత్రం బీజేపి ఎందుకో పక్కన పెట్టేసింది. అయితే ఆమెను ఏ హోదాలో ఉంచుతారన్నదీ తెలీడంలేదు.. మరో నేత సీఎం అయితే ఎమ్మెల్యేగా ఉండేందుకు ఆమె ఇష్టపడరు. రాజస్థాన్ ఎన్నికల కోసం బీజేపి అభ్యర్ధుల తొలి జాబితా రెడీ అయిపోయింది. అమిత్ షా ఆమోద ముద్ర మాత్రమే మిగిలి ఉంది.
చత్తిస్ గఢ్ కు మరో వ్యూహం
చత్తిస్ గఢ్ లోమాత్రం BJP వినూత్న వ్యూహంఅనుసరిస్తోంది. కాంగ్రెస్ సీఎం భూపేష్ భాగెల్ మేనల్లుడు విజయ్ భాగెల్ ను బీజేపీ సీఎం అభ్యర్ధిగా ముందు పెట్టనుంది. భాగెల్ కుటుంబంలో చీలిక తెచ్చి ఆ రాజకీయంతో గెలవాలని ఆలోచిస్తోంది. ప్రస్తుత లోక్ సభ ఎంపీ అయిన విజయ్ భాగెల్ దుర్గ్ జిల్లాలోని పటాన్ నుంచి పోటీ చేస్తారు. గతంలో ఈసీటు నుంచి ముఖ్యమంత్రి భాగెల్ రెండు సార్లు గెలుపొందారు.