ఎట్టకేలకు భక్తుల కోలాహం, జై గణేశనినాదాల మధ్య ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణపతి బొప్పా మోరియా అంటూ లక్షల సంఖ్యలో జనం నినాదాలు చేస్తుండగా, భారీ క్రేన్ మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో జారవిడిచింది. బైబై గణేశా అంటూ భక్తుల నినాదాలతో హుస్సేన్ సాగర్ ప్రాంగణం మార్మోగింది.ట్యాంక్ బండ్ లోని క్రేన్ నెంబర్ 4 నుంచి గణపయ్య నిమజ్జనం జరిగింది. నిమజ్జనాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేయడంతో నగర పోలీసులు, భక్తులు, నిర్వహణాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.. ఉదయంనుంచి ఖైరతా బాద్ పరిసర ప్రాంతాలు జై బోలో గణేష్ మహరాజ్ కి నినాదాలతో మార్మోగాయి. 63 అడుగుల ఎత్తు 40 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అందుకు ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేశారు. ఎస్టీసీ ట్రాన్స్పోర్టు ప్రతి ఏడాది ఆనవాయితీగా స్వామి వారికి భారీ ట్రాలీ సేవలను ఉచితంగా అందజేస్తున్నది. 150 టన్నులను మోసే సామర్థ్యం కలిగిన 26 టైర్ల ట్రాలీ అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న వాహనంలోనే గణపతిని తరలిస్తున్నారు. 40 టన్నులకు పైగా బరువున్న ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా శోభాయాత్రలో ముందుకు కదులుతోంది.. గత పాతికేళ్లుగా తీసుకెళ్లే క్రేన్, డ్రైవర్, ట్రాన్స్ పోర్ట్ ట్రాలీనే ఈసారీ వినియోగిస్తున్నారు. గత నాలుగు రోజుల ముందే ట్రాలీని గణపతి మండపం వద్దకు చేర్చగా, క్రేన్ అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో స్వామి వారి చెంతకు చేరుకున్నది.
నగరం నలు దిశలా కోలాహలం గణేశుడు
భాగ్య నగరంలోఅన్ని ప్రాంతాల్లో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది..హుస్సేన్సాగర్తోపాటు ప్రధాన చెరువుల దగ్గర నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలు ఏర్పాటు కాగా ట్యాంక్ బండ్లో 30 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనానికి సంబంధించి భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు.పోలీసులు. శోభాయాత్ర జరిగే మార్గాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖైరతాబాద్ గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
అంతా అనుకున్న సమయానికే…
అంతకుముందు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భక్తుల కోలాహలం తో ప్రారంభమైయింది. టెలిఫోన్ భవన్ నుంచి సచివాలయం మీదుగా శోభాయాత్ర నెమ్మదిగా కదులుతూ ఉదయం 9:30 నిమిషాలకు గణపయ్య ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. ఉదయం 10:30కు అక్కడ వెల్డింగ్ పనులు పుర్తి చేసుకోని ఆ తర్వాత 11గంటల వరకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. 11:30 నిమిషాలకు ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ కి చేరుకున్నాడు.. దీంతో శ్రీ దశ మహా విద్యా గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణనాధుడి నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతిని ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు గణేశుడు
మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. ఆయా మార్గాల్లో నిఘా పెట్టారు. ఓల్డ్సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. శోభాయాత్ర పూర్తిగా సీసీటీవీ కెమెరాల అద్వర్యంలో ఉంటుంది.ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శోభాయాత్ర జరిగే రూట్లో బారిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.చార్మినార్, మక్కా మసీదు సహా ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఎర్పాటు చేసారు. హుస్సేన్సాగర్, ట్యాంక్బండ్పై స్పెషల్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మహిళలకు ఇబ్బంది ఎదురుకాకుండా షీ టీమ్స్ మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు.