MSS
ప్రముఖ వ్యవసాయ వేత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూశారు. వ్యవసాయ రంగంలో ఎన్నెన్నో సంస్కరణలకు ఆయన ఆద్యుడు. అధిక దిగుబడిని సాధించే గోధుమ విత్తనాలను కనుగొనడంలో ఆయన స్థాపించిన ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్ కీలకపాత్ర పోషించింది. అనేక వ్యవసాయ పరిశోధనా లేబరేటరీల్లో ఆయన వేర్వేరు హోదాలలో పనిచేశారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి ఎన్నెన్నోప్రశంసలు అందుకున్నారు.
98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని తెన్యం పేట్ లోని ఆయన నివాసంలో ఉదయం11.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్వామినాథన్ కుమార్తెల్లో ఒకరైన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫండ్ కు ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మరో కుమార్తె డాక్టర్ మధురా స్వామినాథన్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్ గా ఉన్నారు. నిత్యా స్వామినాథన్ అనే మూడవ కుమార్తె ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో జెండర్ అనాలిసిస్ అండ్ డెవలప్ మెంట్ విభాగంలో లెక్చరర్ గా కొనసాగుతున్నారు.
అధిక దిగుబడి గోధుమ విత్తనాల రూపకల్పనలో విజయం MSS
స్వామినాథన్ 1949లో బంగాళాదుంప, గోధుమలు, బియ్యం, జనపనార పంటలపై జన్యు పరిశోధన చేయడం ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. 1960లో మనదేశంలో వచ్చిన కరువు వల్ల ఆహార ధాన్యల కొరత ఏర్పడింది. అప్పుడే స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్ , ఇతర శాస్త్రవేత్తలతో కలసి అధిక దిగుబడిసాధించే గోధుమ విత్తనాలను రూపొందించారు. అప్పటినుంచే సంప్రదాయ వ్యవసాయ విధానాలనుంచి అధిక దిగుబడి సాధించే విత్తనాల దిశగా, ఇతర ఆధునిక వ్యవసాయ విధానాల దిశగా మనదేశం అడుగులేసింది. అదే మన దేశంలో హరిత విప్లవానికి దారి తీసింది. అందుకే స్వామినాథన్ ను హరిత విప్లవ పితామహుడుగా కొలుస్తారు.
ఆధునిక పద్ధతులపై వ్యతిరేకత
హరిత విప్లవంతో మన దేశం స్వయం సమృద్ధిని సాధించినా దానివల్ల కలిగిన ఇతర పరిణామాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయి. అధిక దిగుబడి విత్తనాలిచ్చే రకాలను ఎరువులు, పురుగుమందులు వాడి రూపొందించినా, ఎరువుల వాడకం వల్ల పర్యావరణం పాడవుతోందని, ప్రజల ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతోందన్న వాదనలు బయల్దేరాయి.
ఎన్నెన్నో పదవులు, పురస్కారాలు
స్వామినాథన్(MSS) అనేక వ్యవసాయ రిసెర్చ్ లేబరేటరీల్లో కీలక పదవులను నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ డైరక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆతర్వాత అంతర్జాతీయ వరి అధ్యయన కేంద్రం డైరక్టర్ జనరల్ గా కొనసాగారు. అలాగే 1979లో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు.
1988లో స్వామినాథన్ ప్రకృతి,ప్రాకృతిక వనరుల నిర్వహణ అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషి ఆయనకు ఎన్నో అవార్డులను,పురస్కారాలను తెచ్చి పెట్టిది. 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును, 1986లో ఆల్బర్ ఐనిస్టీన్ వరల్డ్ ఆఫ్ సైన్స్ అవార్డును ఆయన పొందారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మ భూషణ్,1989లో పద్మ విభూషణ్ అవార్డులనిచ్చి భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 1987లో ప్రపంచ తొలి ఆహార పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.
ధృక్పథాన్ని మార్చిన పరిస్థితులు MSS
1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంబకోణంలో స్వామినాథన్ జన్మించారు. మొదట వైద్య వృత్తిని చదవాలని అనుకున్నా.. 1943లో వచ్చిన బెంగాల్ కరువు ఆయన దృక్పథాన్ని మార్చేసింది. దాంతో ఆయన వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టారు.
అగ్రికల్చరల్ బీఎస్సీ , ఆపై సైటో జెనిటిక్స్ లోపీజీ చేశాక ఇతర రిసెర్చర్లు, వ్యవసాయ రంగ విద్యార్ధులతో కలసి మొక్కలు మొలకెత్తడం పైనా, అనేక వ్యవసాయ పరిశోధనా పద్ధతులపైనా, సహజవనరులు కాపాడుకుంటూనే
అధిక దిగుబడి సాధించే అవకాశాలపైనా అధ్యయనాలు చేశారు.స్వామినాథన్ మరణం నేటి తరానికి తీరని లోటు. ఆయనలా అకుంఠిత దీక్షతో పనిచేసేవారు నేడు కరువే. స్వామి నాథన్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధానితో పాటు అనేక మంది ప్రముఖులు తీవ్ర విచారాన్ని,సంతాపాన్ని తెలియ చేశారు.