LULU
మనిషికి నిత్య జీవితంలో కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేదే షాపింగ్ మాల్.. విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచాక మనదేశంలోకీ పెద్దఎత్తున కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. కళ్లు చెదిరే భవంతులు నిర్మిస్తున్నాయి. హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్లు, డెకథ్లాన్ లు ఏర్పాటు చేస్తున్నాయి. అలా వచ్చినదే లులూ గ్రూప్. తాజాగా హైదరాబాద్ కుకట్ పల్లిలో లులూ అతిపెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. అబుదాబీకి చెందిన ఈగ్రూప్ కి అంతర్జాతీయంగా చాలా గుర్తింపు ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో ఈ సంస్థ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు భారత్ లో కూడా ఈ గ్రూప్ తన వ్యాపారాలను విస్తరిస్తోంది. లులూ షాపింగ్ మాల్స్ ఉత్తరాదిన ఒకే ఒకటి ఉండగా దక్షిణాదిన నాలుగుకు పైగా ఉన్నాయి. LULU
ఇక మనదేశం విషయానికొస్తే మొదటగా లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కేరళ రాష్ట్రం కొచ్చిలో మొదటిగా ప్రారభించారు. ఇది భారతదేశంలోని అత్యంత విశాలమైన షాపింగ్ మాల్. ప్రతిరోజు సగటున 80,000 మంది ఈ మాల్ను సందర్శిస్తారు. కేరళలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది 17 ఎకరాలలో ఉంది.
యూపీలో మాల్ నార్త్ ఇండియాలోకే పెద్దది
ఇక యూపీ రాజధాని లక్నోలో రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. లక్నో మాల్ ను ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించినట్లు లూలూ గ్రూప్ వెల్లడించింది.ఇందులో అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జోన్ ఫన్ టూరా కూడా ఉంది. పెళ్లిళ్లకు కావాల్సిన అభరణాలకు సంబంధించి ప్రత్యేక ఏరియాను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే కీలక బ్రాండ్లు అన్నీ కూడా ఈ మాల్ లో దొరుకుతాయి. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అతిపెద్ద మాల్ ను నిర్మించారు. ఏకంగా 11 అంతస్థులు పార్కింగ్ కోసమే కేటాయించారు. ఇందులోని ఫుడ్ కోర్టులో ఏకంగా ఒకేసారి 1600 మంది కూర్చుని విందు ఆరగించేలా ఏర్పాట్లు చేశారు. ఉత్తర భారత దేశంలో లూలూ గ్రూప్ నిర్మించిన అది పెద్ద మాల్ ఇదే.
మనదేశంలో ఎక్కడెక్కడ?
లూలూ గ్రూప్ ఇప్పటికే భారత్ లో కొచ్చితోపాటు బెంగుళూరు, తిరువనంతపురం, త్రిసూర్ లో మాల్స్ ఏర్పాటు చేసింది.
వివాదాస్పదంగా విశాఖ డీల్ లులూ గ్రూప్ విభజిత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీనికి అప్పటి టీడీపీ ప్రభుత్వం చాలా ఉదారంగా స్థలం కేటాయించింది. అప్పటి సీఎం చంద్రబాబుకు లులూ గ్రూప్ నిర్వాహకులు చాలా సన్నిహితులు కావడంతో అక్కడ ఎకరం కోట్లు పలుకుతుండగా కేవలం నాలుగు లక్షలకు కారు చవకగా ఇచ్చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పైగా ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలకు గ్లోబల్ టెండర్లు పిలవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. అంతేకాదు పర్యావరణ నిబంధనలు బేఖాతరు చేసి కోస్టల్ రిగ్యులేషన్ జోన్ ఏర్పాటు లేకుండానే మాల్ నిర్మాణానికి అనుమతులివ్వడం మరో తప్పు. దీనిపై స్థానిక పర్యావరణ వేత్తలు తిరగబడ్డారు కూడా.. అయినా లెక్క చేయని ప్రభుత్వం నిర్మాణానికే మొగ్గు చూపింది. హార్బర్ పార్క్ ఎదురుగా 2019 ఫిబ్రవరిలో మాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునాదిరాయి వేశారు. పదివేల మంది సామర్ధ్యం కలిగిన విశాలమైన కన్వెన్షన్ సెంటర్, 20 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్, మరో లగ్జరీ హోటల్ నిర్మించాలన్నది లక్ష్యం. దీనికోసం అప్పటి సీఎం చంద్రబాబు కోచిలోని లులూ మాల్ ను చూసోచ్చారు కూడా..
క్విడ్ ప్రోకో ఆరోపణలు
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా కారుచౌకగా భూములు కట్టబెట్టడం వెనక క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇంతలో ఎన్నికలు రావడం చంద్రబాబు ఓడిపోవడం జరిగాయి. అధికారంలోకి వచ్చిన జగన్ ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న కారణంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. అయితే బిడ్డింగ్ ప్రోసెస్ పారదర్శకంగానే సాగిందని ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ కాస్ట్ కింద కన్సల్టంట్లను నియమించి డిజైన్ చేశామని ఈక్రమంలో తాము భారీగా నష్టపోయామని లులూగ్రూప్ డైరక్టర్ అనంత్ రామ్ అప్పట్లో తెలిపారు. అందుకే తాము ఈ డీల్ నుంచి వైదొలగుతున్నామని స్పష్టం చేశారు.విశాఖకు గుడ్బై చెప్పిన తరువాత చెన్నైలో మాల్ ఏర్పాటుకు లులూ గ్రూప్ సన్నద్ధమైంది. తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకొని 3 వేల కోట్ల రూపాయిలతో కోయంబత్తూర్లో హైపర్ మార్కెట్ను ఏర్పాటు చేసింది.
కుకట్ పల్లి మాల్ వెనక కేటీఆర్ LULU
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ UAE ప్రఖ్యాత సంస్థ లూలు గ్రూప్ తో చర్చలు జరిపి. హైదరాబాద్ లో లులు షాపింగ్ మాల్ ఏర్పాటుకు ఆ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంస్థ సైతం హైదరబాద్ కూకట్ పల్లిలో షాపింగ్ మాల్ ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. గతంలో కూకట్పల్లిలోని మంజీరా మాల్ ను రీమోడల్ చేసి ఈ లులు గ్రూప్ షాపింగ్ మాల్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించారు. మొన్న బుధవారం ఓపెన్ కావడంతో ఇప్పుడీ మాల్ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
అంతర్జాతీయ ప్రమాణాలు LULU
అంతర్జాతీయ ప్రమాణాలతో కుకట్ పల్లి లులు మాల్ ను తీర్చిదిద్దారు. 75 దేశీ, విదేశీ బ్రాండ్ స్టోర్లు ఈ మాల్ లో ఉంటాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్, ఇలా కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 1400 మంది సినిమాలను వీక్షించవచ్చు. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఎలక్ట్రానిక్, ఐటీ వస్తువులు, మొబైల్స్ ఇలా అన్ని ఈ మాల్ లో లభిస్తాయి. అలాగే పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంది .