Asia Games
సమర్ధత, సత్తాలకు పేదరికం అడ్డంకి కాదు. మనలో టాలెంట్ ఉండాలే గానీ ఓరోజు కాపోతే ఓరోజైనా దానికి తగిన గుర్తింపు వస్తుంది. పేదరికంలో పుట్టి పూట గడవని స్థితిలో ఉంటూ ఆసియా గేమ్స్ లో సత్తా చాటిన ఓ మెడలిస్ట్ కథ ఇది. యూపీకి చెందిన రాంబాబు 35 కిలోమీటర్ల రేస్ వాక్ లో ఆసియా గేమ్స్ లో కాంస్య పతకం సాధించి తన సత్తా చాటాడు. ఇందులో ఏముంది గొప్ప అనుకోవచ్చు. కానీ దీని వెనుక అతగాడి కృషిని , కష్టాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. పూట గడవడమే కష్టమైన రోజుల్లో ఓ హోటల్ లో దినసరి వేతనం మీద వెయిటర్ గా పని చేసిన చరిత్ర అతగాడిది.
అలా ఉంటూనే అథ్లెటిక్స్ లో శిక్షణ పొందాడు రాంబాబు.. కోవిడ్ పాండమిక్ సమయంలో తండ్రితో కలసి గ్రామీణ ఉపాధి హామీ పథకం లో చేరి రోజు కూలీగా సేవలందించాడు. వారణాసిలో ఓహోటల్ లో వెయిటర్ గా మొదట్లో పనిచేశాడు రాంబాబు. ఆ తర్వాత కోవిడ్ వచ్చి అన్ని బిజినెస్ లు మూత పడ్డాయి. అదే టైమ్ లోజాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేరి రోడ్ల నిర్మాణం కోసం తండ్రితో కలసి గుంతలు తవ్వాడు. ఇలా అనునిత్యం కష్టాలు పడుతూ.. కొలిమిలా మండుతూ తన లక్ష్యాన్ని సాధించాడు.
ఆకలి బాధలు చూసిన కుటుంబ నేపధ్యం
సాధించాలన్న తపన ఉండాలే గానీ ఇబ్బందులు, అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయ్ అంటాడు రాం బాబు. యూపీలోని సోంభద్రజిల్లాలో బెహురా గ్రామానికి చెందిన రాంబాబు తండ్రి మొదట్లో కూలీ పనులు చేసేవాడు.అయితే నెలకు మూడువేలు కూడా సరిగా రాని చాలీ చాలని జీతంతో కుటుంబం మొత్తం పోషించడం కష్టంగా ఉండేది. ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఆ కుటుంబం ఆకలి బాధలను చవిచూసింది.
ముగ్గురు అక్క చెల్లెళ్లకు రాంబాబు ఒక్కడే తమ్ముడు. తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. “మాకు ఆస్తిపాస్తులేవీ పెద్దగా లేవు. మా నాన్న వ్యవసాయ కూలీ. అప్పుడప్పుడే ఆయనకు పనులు దొరుకుతాయి. వరి కోతల సమయం, నాట్లు వేసే సమయంలో తప్ప ఇతర సమయాల్లో కుటుంబానికి ఆదాయం ఉండేది కాదు. కుటుంబ పోషణే కష్టంగా ఉన్నటైమ్ లో అథ్లెటిక్స్ లో రాణించాలన్న నా కల నెరవేరుతుందా అనే బాధ నాకు ఉండేది” అంటాడు రాం బాబు.
చదువుమీద దృష్టి లేదు…
” నాకు చదువు పెద్దగా అబ్బలేదు. ఆసక్తి కూడా లేదు. అందుకే ఆటలపై దృష్టి పెట్టా.. ఏదో ఒకరోజు దేశం గర్వించే విధంగా గుర్తింపు పొందాలన్న తపన ఉండేది. ఇంటికి దగ్గరే ఉన్న జవహర్ నవోదయా విద్యాలయలో ఎంట్రన్స్ రాస్తే సీటు వచ్చింది. దాంతో నన్ను ఆరో తరగతిలో చేర్చారు. అక్కడ నాకు చదువే రాదన్న సంగతి తెలిపోయింది. రెండేళ్లు కూడా సరిగా చదవలేకపోయాను. ఆ సమయంలోనే 2012 ఒలింపిక్ క్రీడలు జరిగాయి.
అందులో భారత్ ఆరు మెడల్స్ సాధించింది. స్కూల్ హాస్టల్ లో టీవీలో చూసిన నేను నా లక్ష్యాన్ని అప్పుడే నిర్దేశించుకున్నాను ” అంటాడు రాంబాబు. ” మేరీకోమ్, సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, గగన్ నారంగ్ లు పతకాలతో జేజేలు అందుకోడం నా మనసులో నిలిచిపోయింది. పత్రికల మొదటి పేజీల్లో ఆ వార్తలు రావడం నాకింకా గుర్తు.. 2012 ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన వారి వివరాలతో కూడిన పత్రిక క్లిప్పింగులని కట్ చేసి దాచుకున్నా.. అదే నా భవిష్యత్తుకు ఒక బాట వేసింది ” అంటాడు రాంబాబు.
జీవిత లక్ష్యాన్ని నిర్దేశించిన పరుగు Asia Games
జవహర్ నవోదయా విద్యాలయలో ఉన్నప్పుడు ఫుట్ బాల్ తో సహా అన్ని ఆటలు ఆడేవాడట రాంబాబు. అయితే కిలో మీటర్ల కొద్ది దూరం పరిగెత్తినప్పుడు తనలో అలసట, రాకపోవడం గుర్తించి పరుగు పందెంపై ఆసక్తి పెంచుకున్నాడు రాంబాబు. మొదట్లో పదివేల మీటర్లు, ఐదు వేల మీటర్ల మారథాన్ రన్ లలో పాల్గొనడంతో మోకాళ్ల నొప్పులు వచ్చాయి. అయితే స్థానిక కోచ్ ప్రమోద్ యాదవ్ తనను రేస్ వాకింగ్ పై దృష్టి పెట్టమని సలహా ఇచ్చాడు.దాంతో రేస్ వాకింగ్ లో ఆసక్తి పెంచుకున్నాడు రాంబాబు.
సోషల్ మీడియా సహాయం
అంతేకాదు సోషల్ మీడియాను తన ప్రచారానికి బాగా వాడుకున్నాడు. ఫేస్ బుక్ ఎక్కౌంట్ తెరిచి అనేక గ్రూపులలో జాయిన్ అయ్యాడు. ఫిట్ నెస్ పైనా, లాంగ్ డిస్టాన్స్ రన్నింగ్ పైనా అనేక సూచనలు, సలహాలు పొందాడు, 17 ఏళ్ల వయసు వచ్చాక వారణాసిలోని అథ్లెటిక్స్ స్టేడియంలో చేరి అక్కడ ప్రాక్టీసింగ్ మొదలు పెట్టాడు. వారణాసిలో రూమ్ అద్దెకు తీసుకుని అక్కడ పార్ట్ టైమ్ ఓ హోటల్ లో వెయిటర్ గా చేరాడు. అయితే అర్ధరాత్రి దాటినా అక్కడ పని తెమలకపోవడం, ప్రాక్టీస్ కు నాలుగు గంటలకే లేవాల్సి రావడంతో ఆరోగ్యం దెబ్బతింది.పైగా వెయిటర్ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకొవడమేంటి అంటూ చులకనగాచూసేవారు. దాంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత 2019లో భోపాల్ సాయి సెంటర్ లో చేరి నేషనల్ రేస్ వాక్ ఛాంపియన్ షిప్ కోసం శిక్షణ తీసుకున్నాడు. అదే సమయంలో కోవిడ్ రావడంతో కోచింగ్ సెంటర్ మూత పడింది. దాంతో మరోసారి ఇంటికి రాక తప్పలేదు. ఇల్లు గడవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేరాడు. రోజుకు మనిషికి రూ.400 ఇచ్చేవారు. దాంతో తండ్రి, తాను కలసి పనిచేసేవారు.
అవార్డుల పరంపర Asia Games
2021లో జాతీయ రేస్ వాక్ ఛాంపియన్ షిప్ లో 50 కిలోమీటర్ల రేస్ వాక్ లో రాంబాబు సిల్వర్ మెడల్ సాధించాడు. అదే అతనికి రాచబాట వేసిది. బసంత్ రాణా అనే కోచ్ సాయంతో పూనే ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోగలిగాడు. ఆ తర్వాత 2021లో నేషనల్ ఓపెన్ ఛాంపియన్ షిప్స్ లో 35 కిలోమీటర్ల రేస్ వాక్ లో గోల్డ్ మెడల్ సాధించాడు రాంబాబు. ఈ ప్రయత్నంతో అతనికి ఆర్మీలో హవల్దార్ ఉద్యోగం వచ్చింది.
అయితే వయసు కాస్త పెద్దది కావడంతో ఉద్యోగార్హతకు సరిపోలేదు. దాంతో బంగారు పతకం సాధించాడన్న కారణంగా రాంబాబుకు నిబంధనల నుంచి సడలింపు వచ్చింది. ప్రస్తుతం పదివేల రూపాయల బేసిక్ పే తో ఆర్మీలో హవల్దార్ గా పనిచేస్తున్నాడు. తాజాగా 2023 ఆసియా గేమ్స్ లో 35 కిలోమీటర్ల మిక్స్ డ్ టీమ్ రేస్ వాక్ లో కాంస్య పతకం సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. రాంబాబు ఈ స్థితికి రావడానికి తల్లి దండ్రులు పడిన కష్టం కూడా చిన్నది కాదు. వారు కూడా కూలీలుగా పనిచేసి కష్టపడి సంపాదించిన సొమ్మును ఇచ్చి శిక్షణ ఇప్పించారు. అందుకే జన్మనిచ్చిన తల్లి దండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటున్నాడు ఈ కాంస్య పతక గ్రహీత. రాంబాబులా ప్రతీ ఒక్కరూ తమ లో టాలెంట్ ను గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు.