Israel
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మళ్లీ కక్షలు భగ్గుమన్నాయి.చెప్పా పెట్టకుండా ఈ ఉదయం నుంచి పాలస్తీనా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు మొదలు పెట్టింది. దాదాపు 5000రాకెట్లు ఒకదాని తర్వాత ఒకటి దూసుకొచ్చి ఇజ్రాయెల్ పై పడటంతో ఆ ప్రాంతమంతా అగ్ని కీలలు అలుముకున్నాయి. పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ గ్రూప్ ఈ చొరబాట్లకూ పాల్పడటంతో ఇజ్రాయెల్ బిత్తరపోయింది. ఊహించని ఈ దాడికి క్షణాల్లోనే తేరుకుని గట్టి కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు దేశంలో యుద్ధ వాతవరణం ఉందన్న సంకేతాలను కూడా ప్రకటించింది.
అంతా 20 నిమిషాల వ్యవధిలోనే… Israel
ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గాజా స్ట్రిప్ ను పాలస్తీనా దాడులకు వినియోగించుకుంది. జెరూ సలేం, టెల్ అవీవ్ సహా దేశ వ్యాప్తంగా ఎయిర్ రెడ్ సైరన్ల మోత మోగిపోయింది. కేవలం 20 నిమిషాల్లో వేలాది రాకెట్లు ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్లాయి. హమాస్ తీవ్రవాదులు దేశంలో అనేక ఎంట్రీ పాయింట్ల దగ్గర చొరబాట్లకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేత న్యాహు కార్యాలయం సెక్యూరిటీ చీఫ్ లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హమాస్ తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తామని.. హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ పై దాడి తర్వాత ప్రపంచ భౌగోళిక వాతవరణంలో మరో అతిపెద్ద ఉద్రిక్తతలకు ఆస్కారమున్న వివాదంగా ఇది మారిపోయింది.
అడుగడుగునా సైరన్ మోతలు Israel
ఇజ్రాయెల్ దేశమంతా ఇప్పుడు సైరన్ల మోత మోగుతోంది. పవిత్ర జెరూసలేం నగరంలో కూడా ఇదే పరిస్థితి. ఇజ్రాయెల్ దేశం దక్షిణ భాగం, సెంట్రల్ ప్రాంతంలోనూ క్షిపణి దాడుల ప్రభావం కనిపించింది.
ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాం : హమాస్
మరోవైపు హమాస్ గ్రూప్ ఆపరేషన్ ఆల్ అక్సాఫ్లడ్ మొదలైనట్లు ప్రకటించింది. ఆపరేషన్ మొదలైన 20 నిమిషాల్లోనే ఐదు వేల రాకెట్లను ప్రయోగించినట్లు ప్రకటించింది. దేవుని దయతో ఈ యుద్ధానికి ఒక ముగింపు పలకాలని అనుకుంటున్నాం. శత్రువు బాధ్యతా రాహిత్యంగా, నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటున్నాం అని హమాస్ మిలిటెంట్ నేత మహమ్మద్ డీఫ్ ఓ ప్రీ రికార్డ్ స్పీచ్ లో కామెంట్ చేశాడు. గాజా స్ట్రిప్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్లోకి ఆర్మీ వాహనాలు, పారాచూట్లతో హమాస్ ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారు.
సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈకాల్పుల్లో అనేక మంది అమాయక పౌరులు కూడా బలవుతున్నారు. మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని అంచనాలున్నాయి. పాలస్తీనా దాడులకు ఇజ్రాయెల్ భూభాగంలో ఓ వృద్ధురాలికి రాకెట్ తగలడంతో ఆమె మరణించింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులందరూ ఇళ్లకే పరిమితం కావాలని, షెల్టర్ హోమ్స్ లో ఉండాలని ఆదేశించింది. గాజాస్ట్రిప్ పరిసరాల్లో ఉన్న వారంతా ఇళ్లు వదిలి బయటకు రావొద్దని సూచించింది. హమాస్ తీవ్రవాద దాడులకు ఇజ్రాయెల్ బలవుతోంది. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసునంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.
2007 నుంచి రెండు దేశాల మధ్యా గొడవలే…
2007 లో గాజాలో హమాస్ అధికారం తీసుకున్నాక పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఎన్నో సార్లు యుద్ధాలు చేశాయి. గాజన్ వర్కర్లకు ఇజ్రాయెల్ సరిహద్దులు మూసేయడంతో ఉద్రిక్తతలు రేగాయి. అందులో భాగంగానే ఈ దాడులు జరిగాయి. చొరబాట్లకు చరమ గీతం పాడాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంలో నేరాలకు పాల్పడుతోంది. ప్రత్యేకించి జెరూసలేంలోని పవిత్ర ఆల్ అక్సా ప్రాంతంలో… దీన్ని మేం ఖండిస్తున్నాం అని హమాస్ ప్రకటించింది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా 247మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయెలీలు , మరో ఇద్దరు విదేశీయులు చనిపోయారు. వీరిలో సైనికులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. తాజా దాడులను చూస్తే గాజా సరిహద్దులపై ఇజ్రాయెల్ సైన్యం పట్టుకోల్పోయిందని అర్ధమవుతోంది.