ఎయిర్ ఇండియా విమానాలు కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. అయితే ప్రయాణీకుల సౌకర్యాలు మెరుగు పడతాయనుకుంటే పొరపాటే. కేవలం రీ బ్రాండింగ్ కోసమే వాటిని కొత్తగా మారుస్తున్నారు. విమానయాన రంగంలో నెంబర్ వన్ బ్రాండ్ లో ఉన్న ఈ సంస్థ కొత్త లోగో, కొత్త డిజైన్ ఈమధ్యే విడుదల చేశారు.ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో ఈ కొత్త ఫొటోలను షేర్ చేస్తూ ..మన మహారాజు లాంటి మెజెస్టిక్ A350 విమానాల ఫస్ట్ లుక్ ఇదే..
కొత్తగా టౌలౌస్ లోని పెయింట్ షాప్ నుంచి రిలీజ్ అయిన ఫోటోలివి అని షేర్ చేసింది. ఈ శీతాకాలం ఈ విమానాలు ఇండియాకు చేరుకుంటాయని తెలిపింది. ఎయిర్ ఇండియా ట్విట్టర్ లో రిలీజ్ చేసిన ఫోటోలలో విమానాలు బ్రాండ్ న్యూ లుక్ లో చాలా స్టైలిష్ గా, అందంగా, హుందాగా కనిపిస్తున్నాయి. రెడ్ ఆర్చి షేప్ విండోతో ఉన్న ఎయిర్ ఇండియా బ్రాండ్ ను గోల్డెన్ కలర్ తో రీప్లేస్ చేశారు. ఎయిర్ ఇండియా నేమ్ కుడివైపు పై భాగంలో ఉంచారు. ఇక విమానం తోక భాగం కూడా మరింత అందంగా, మోడ్రన్ లుక్ తో డిజైన్ చేశారు. దానికోసం రెడ్, గోల్డ్, పర్పుల్ రంగులను ఉపయోగించి ఆరెంజ్ కలర్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
2025 నాటికి అన్ని విమానాల మార్పు A350
ఎయిర్ ఇండియాను రీబ్రాండింగ్ చేయడం వెనక పెద్ద వ్యూహముంది. ఇప్పటికే ఈ డీల్ కోసం 18 వేలకోట్లు ఖర్చు పెట్టారు.మరో 470 కొత్త విమానాలు కూడా కొనాలని నిర్ణయించారు. తొందరలోనే తమ ఫ్లీట్ లో ఉన్న పాత విమానాలన్నింటినీ కొత్తవిగా రూపొందిస్తారు. ఈ అన్ని మార్పులతోనూ సంస్థకు పునర్వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ నాటికి ఇండియా చేరుకునే ఈ విమానాలు అప్పటినుంచి కొత్త లోగోతో తమ సర్వీసులు మొదలు పెడతాయి. దశల వారీగా ఈ రీమోడలింగ్ టెక్నిక్ తో ఈ కంపెనీలోని విమానాల్నింటినీ నయా లుక్ లోకి మార్చేస్తారు. ఈప్రక్రియ 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా వేస్తున్నారు.
ది విస్టా… మహారాజ మస్కట్
టాటా గ్రూప్ ఈ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత దాని లుక్ ను, డిజైన్ ను రీమోడల్ చేయాలని నిర్ణయించారు. సంస్థ సింబల్ అయిన మహారాజ ఐకాన్ ను అలాగే ఉంచాలని నిర్ణయించారు. కొత్త లోగోలో ద విస్టా గా పిలిచే గోల్డ్ కలర్ మహారాజ్ మస్కట్ విండో ఫ్రేమ్ ను ఉంచారు. అపరిమిత అవకాశాలు, అభివృద్ధి, భవిష్యత్తుపై ఈ సంస్థకున్న విశ్వాసం, ధైర్యం లకు గుర్తుగా ఈ కొత్త లోగోను ఆవిష్కరించామని కంపెనీ చెబుతోంది. లోగోలోని ఎయిర్ ఇండియా అనే ఫాంట్ ను కూడా మార్చారు.
కొత్త ఎయిర్ బస్సుల కొనుగోలు
2022 జూన్ లో విశాలమైన బాడీ కలిగిన ఎయిర్ బస్ ల A350 లను కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఈ ఎయిర్ బస్ లకు ఇంధన ట్యాంకు చాలా పెద్దగా ఉంటుంది. దూర ప్రయాణాలకు అత్యంత అనుకూలం. భారత, అమెరికా దేశాల మధ్య రవాణాకు బాగుంటుంది. 2006 నుచి ఒక్క విమానాన్ని కూడా ఇండియన్ ఎయిర్ లైన్స్ కొనుగోలు చేయలేదు. అప్పట్లో 111 విమానాలు,68 బోయింగ్ విమానాలు, 43 యూరోపియన్ విమాన యాన సంస్థకు చెందిన ఎయిర్ బస్సులను మాత్రమే కొనుగోలు చేశారు.