సినీనటి జయసుధ బీజేపీలో చేరుతున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. పార్టీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో జయసుధ బీజేపీలో త్వరలో చేరనున్నారని తెలిసింది. జయసుధ గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్ మరణం తర్వాత ఆమె వైసీపీలో చేరారు. 2022 వరకూ వైసీపీలో ఉన్న జయసుధ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకూ జయసుధ కాంగ్రెస్ లో ఉన్నారు. 2016 నుంచి 2019 వరకూ టీడీపీలో కొనసాగారు. 2019 నుంచి 2022 వరకూ వైసీపీలో ఉన్నారు.
ముషీరాబాద్ నుంచి…
అయితే జయసుధను ఈసారి ముషీరాబాద్ నుంచి పోటీ చేయించే అవకాశాలున్నట్లు తెలిసింది. కె.లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి లభించడంతో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి ఎవరా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్న తరుణంలో జయసుధ పేరు తట్టింది. వెంటనే ఆమెను సంప్రదించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సినీనటిగా అందరికీ సుపరిచితం కావడంతో ఆమె పేరును ముషీరాబాద్కు ఖరారు చేసినట్లు తెలిసింది.