(Anushka)
థియేటర్ ఆర్టిస్టుగా ప్రయాణాన్ని ప్రారంభించి.. యూట్యూబర్గా యూటర్న్ తీసుకుని.. ఇప్పుడు హీరోగా యమ స్పీడుతో దూసుకుపోతున్నాడు నవీన్ పొలిశెట్టి. చేసింది రెండు సినిమాలైనా.. తన పంచులు, కామెడీ టైమింగ్తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ జాతిరత్నం. తాజాగా స్వీటీతో జతకట్టి ఇద్దరూ కలసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొచ్చారు. ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్లో నటించిన అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోశ రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. తనకి ఇష్టమైన వంటకం ఎలా చేయాలో తెలిపిన అనుష్క.. ఈ ఛాలెంజ్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి విసిరింది.
ప్రభాస్ టు చెర్రీ.. ఆపై రానా (Anushka)
టాలివుడ్ లో ప్రాభాస్ ఎంత భోజన ప్రియుడో అందరికి తెలుసు. విందు భోజనాలప్పుడు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బాహుబలి పెట్టే భోజనం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర లేదు. తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ దానిని ఎలా తయారు చేయాలోతనట్విటర్ ఖాతాలో రెసిపీని వివరించాడు. ఆ తరువాత ఛాలెంజ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు పంపించాడు. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరించిన చెర్రీ తనకి ఇష్టమైన వంటకం చేపల పులుసని తేల్చేశాడు. ముందుగా మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి టీమ్ కి బెస్ట్ విషెస్ చెబుతూనే తనకిష్టమైన వంటకం తయారీ విధానాన్ని కూడా వివరించాడు రాం చరణ్. ఆ తర్వాత తన ఛాలెంజ్ ను బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాకు విసిరాడు. చెర్రీ ఛాలెంజ్ ను స్వీకరించిన రానా తనకు స్వీట్స్ కంటే కారంగా ఉండేవే ఎక్కువగా తింటానని, అవే ఎక్కువ ఇష్టమని అన్నాడు. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని అన్నాడు. హైదరాబాదీ బిర్యానీని ఎలా తయారు చెయాలో వివరించిన రానా బిర్యానీ వడ్డించేటపుడు ఫోర్కులు, స్పూన్లు టేబుల్పై ఎందుకు పెట్టుకుంటారో అర్థం కావడం లేదు. మీరు దీన్ని మీ చేతితో తినాలి. బిర్యానీ లాంటి వంటకాన్ని చేత్తోనే తినాలని అలాగే తనకు ఇష్టమని అన్నాడు రానా.
రానా ఈఛాలెంజ్ మరెవరికి విసురుతాడా అని ఉత్కంఠగా ఎదురు చూసిన జనాల గాలి తీసేశాడు రానా.తాను ఈసవాల్ ను ప్రేక్షకులు, అభిమానులకు విసురుతున్నానని అన్నాడు.అక్కడితో స్వీటీ విసిరిన ఛాలెంజ్ రానా దగ్గరకొచ్చి ఆగిపోయింది.నవీన్, అనుష్క అసలు ఈ కాంబో సినిమా అసలు ఊహించలేరు.కానీ కథ వారిద్దరిని కలిసి నటించేలా చేసింది.ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేసిన సినిమాకు హిట్ టాక్ రావడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది.నిశ్శబ్ధం సినిమా నిరాశ పరిచినా సరే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వల్ల అనుష్క హ్యాపీగా ఉంది.ఈ సినిమా రిజల్ట్ మీదే తన నెక్స్ట్ సినిమాలు ఆధారపడి ఉంటాయని భావించిన అనుష్క ప్రేక్షకుల్లో తన క్రేజ్ చూసి వరుస సినిమాలు చేయాలని అనుకుంటోంది.