(AP)
అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సస్పెన్షన్లతో దద్దరిల్లాయి. అధినేత జైల్లో ఉండటంతో ప్రజల గొంతుగా ఉండాల్సిన విపక్షంలో వ్యూహం లోపించింది. చంద్రబాబు అరెస్టు అంశాన్ని వాడుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి వీలైనంత మైలేజీ పొందాలన్నది టీడీపీ వ్యూహం. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మాత్రం రాజకీయం చేయకుండా ఉండదు…అయితే అందుకు అనుసరిస్తున్న వ్యూహంలోనే అనుభవ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓపక్క దిశా నిర్దేశం చేసే నేత జైలు పాలు కావడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్సత్తువ, అసహనం, ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి టీడీపీ తన నిరసనను వ్యక్తం చేయాలని భావించింది.
ఈ సమావేశాలను సాధ్యమైనంత రచ్చ చేయాలని టీడీపీ నేతలు ముందుగానే ప్లాన్ వేసుకుని సమావేశాలకు హాజరయ్యారు. అయితే తలచినదే మొదలు ఏదో చేసేయాలన్న ఆరాటం, సాధ్యమైనంతగా రచ్చ, రగడ చేయాలన్న ఆతృత తప్ప సమావేశాలలో పాటించాల్సిన నియమ నిబంధనలను గాలికొదిలేశారు. సభా వ్యవహారాల నిర్వహణ లో ఏకాభిప్రాయం కోసం ఏర్పాటు చేసే బీఏసీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. సభకు హాజరవుతూనే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే దీనిపై చర్చకు స్పీకర్ తిరస్కరించారు.
అయితే చంద్రబాబు అరెస్టుపైనా, స్కిల్ స్కామ్ పైనా రేపు పూర్తి స్థాయి చర్చ జరుగుతుందని అందులో పాల్గొనాలని స్పీకర్ కోరారు. అయితే వినిపించుకోకుండా టీడీపీ ఎమ్మెల్యేలంతా ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు దూసుకెళ్లారు. రచ్చ ఎంతకూ తగ్గకపోవడం , టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆపై మళ్లీ అదే వైఖరి కొనసాగించడంతో టీడీపీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురిని ఈ సెషన్స్ అయ్యేంత వరకూ సస్పెండ్ చేశారు.
బాలయ్య కామెడీ (AP)
సందట్లో సడేమియాలా హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య సభలో మీసం మెలేసి అంతు చూస్తామని కవ్వించారు. స్పీకర్ తమ్మినేని బాలయ్యను ఘాటుగా హెచ్చరించారు. సభలో ఇలాంటి పోకడలు తగవని వారించారు. తొలి తప్పిదంగా భావించి వదిలేస్తున్నామన్నారు. మరోవైపు అధికార పక్షం ఈ సందర్భాన్ని బాగా ఉపయోగించుకుంది. బాలకృష్ణ కు అసెంబ్లీకి, సినిమా సెట్ కు తేడా తెలీటం లేదని ఎద్దేవా చేసింది. ఫ్లూటు జింక ముందు ఊదు జగన్ ముందు కాదు అంటూ మంత్రి రోజా వెటకారం చేశారు. సభలో ఇలాంటి వేషాలేంటి బయటకెళ్లి మీసాలు తిప్పుకోండి అని మరో మంత్రి అంబటి కూడా ఎద్దేవా చేశారు.అయితే బాలయ్యకు స్పీకర్ వార్నింగ్ ఇవ్వడాన్ని కూడా టీడీపీ సరిగా తీసుకోలేకపోతోంది. దీనిపై ఖండనలూ, కౌంటర్లు మొదలయపోయాయి.
మొదటే డిఫెన్స్ గేమ్ తో సెల్ఫ్ గోల్ (AP)
మొత్తం మీద స్కిల్ స్కామ్ పై రేపు అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. టీడీపీ ఎమ్మెల్యేలు రేపు దీనిపై చర్చలో పాల్గొని చంద్రబాబు అసలు ఏ తప్పులూ చేయలేదని వాళ్ల వాదనను పకడ్బందీగా వినిపించవచ్చు.
ఈ సువర్ణావకాశాన్ని వదిలేసుకుని ముందే డిఫెన్స్ గేమ్ మొదలు పెట్టేసి రచ్చ చేసేసి సస్పెన్షన్ ఆర్డర్స్ తెచ్చేసుకుని
చేతులు దులుపుకుని వెళ్లిపోవడం ఏం కరెక్ట్? అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఐదు రోజులు.. అందులో శని, ఆదివారాలు సభకు శెలవు. ఈనెల 27 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకుని స్కిల్ స్కామ్ పై టీడీపీ చెప్పదలచుకున్న వాదనలను చెప్పి ఉంటే బాగుండేది.. కానీ వ్యూహంలో లోపమే ఇలా టీడీపీ తప్పటడుగు వేయడానికి కారణమైంది.