భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంద్రీశ్వరి నియమితులయ్యారు. పదవీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి చిన్నమ్మ దూకుడుగా వెళుతున్నారు. వరస సమావేశాలతో క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జోనల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. క్యాడర్ లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత అధ్యక్షుడికి భిన్నంగా పురంధ్రీశ్వరి వ్యవహారశైలి సాగుతుండటం చర్చనీయాంశమైంది.
బాధ్యతలను చేపట్టిన నాటి….
పార్టీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. వైసీపీని ఛేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పురంద్రీశ్వరి కనిపిస్తుంది. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని, తాము మాత్రం ప్రజా సమస్యలపై పోరాడతామని చెబుతూ అధికార వైసీపీపై విమర్శలు సంధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చినట్లు ప్రజల ముందుకు వెళ్లడాన్ని ఆమె తప్పుపట్టారు. దేశంలో కల్లా ఏపీకే ఎక్కువ ఇళ్లను కేంద్రం కేటాయించిందన్న పురంద్రీశ్వరి, ఆ విషయాన్ని ఎక్కడా వైసీపీ నేతలు చెప్పకపోవడంపై అభ్యంతరం తెలిపారు.
తీవ్ర విమర్శలతో…
గత అధ్యక్షుడు సోము వీర్రాజు కొంత వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవారన్న పేరుండేది. ఆయన ప్రతిపక్ష టీడీపీని కూడా వదిలిపెట్టేవారు కాదు. కానీ పురంద్రీశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత మాత్రం టార్గెట్ వైసీపీగానే ఆమె ముందుకు వెళుతుందంటున్నారు. పొత్తులు.. ఎత్తులు.. కేంద్ర నాయకత్వం చూసుకుందని చెబుతూనే చిన్నమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై అభ్యంతరం చెప్పిన పురంద్రీశ్వరి, మెడికల్ సీట్లను ప్రభుత్వమే లక్షల రూపాయలకు అమ్ముకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
హైకమాండ్ సూచనల…
ఏపీ బీజేపీలో ఎప్పుడూ రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూల వర్గం కాగా, మరొకటి వ్యతిరేక వర్గం. పురంద్రీశ్వరి తనపై ఏ వర్గం ముద్రపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తొలుత భావించినా పార్టీ హైకమాండ్ సూచనల మేరకు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమే ఎక్కువగా చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చిన్నమ్మ వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందని, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెను క్యాడర్ తో పాటు జనం కూడా ఆదరిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీ పార్టీ పరిస్థితిలో ఛేంజ్ తీసుకురావడానికి పురంధ్రీశ్వరి చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.