సహకార వ్యవస్థను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బలోపేతం చేశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో రుణాలు తక్కువ వడ్డీకి అందించడమే సహకార వ్యవస్థ లక్ష్యమన్నారు. ఆప్కాబ్ ను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత బలోపేతం చేశామని జగన్ తెలిపారు. ఆప్కాబ్ తోనే రైతాంగానికి బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గరయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆప్కాబ్ కొంత ఇబ్బందుల్లో పడినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు అధికంగా కేటాయించామని తెలిపారు.
లాభాల బాటన డీసీసీబీలు…
60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా పూర్తి పారదర్శకతను ఆప్కాబ్ లో తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను మార్చి ఆప్కాబ్ ను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ఒక్క ఏలూరు మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయని జగన్ చప్పట్ల మధ్య ప్రకటించారు. మూడు దశబ్దాల తర్వాత కర్నూలు డీసీసీబీ లాభాల బాట పట్టిందిన్నారు. ఇందుకు కృషి చేసిన సిబ్బందికి తన అభినందనలు తెలియచేస్తున్నానని జగన్ అన్నారు.
ఇక గ్రామంలోనే…
నాలుగేళ్లలో ఆప్కాబ్ లావాదేవీలు బాగా పెరిగాయని జగన్ అన్నారు. ప్రాధమిక సహకార పరపతి సంఘాలను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేయడం వల్ల రైతుకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ బ్యాంకింగ్ కరస్పాండెంట్ కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో విప్లవాత్మకమైన మార్పులు చూస్తామన్నారు. ఆర్బీకేల వద్దే రైతులు రుణాన్ని కూడా పొందే వీలు దొరుకుతుందన్నారు. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని జగన్ ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా జగన్ ఆప్కాబ్ కొత్త లోగోను ఆవిష్కరించారు.