ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖలో కాపురం పెడతామని బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సెప్టంబరు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి తన మకాంను విశాఖకు మారుస్తారా? లేదా? అన్న చర్చ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వ వర్గాల్లోనూ జరుగుతుంది. ముఖ్యమంత్రి నివాసం ఉండే భవనం ఇప్పటికే సిద్ధమవుతుంది. అధికారులు అన్ని హంగులూ పూర్తి చేస్తున్నారు. అక్కడి నుంచే సమీక్షలను ముఖ్యమంత్రి జగన్ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సుప్రీంకోర్టులో…
అయితే మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఎన్ని వాయిదాలు పడతాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికప్పుడు తేలే అంశం కాదు. సుప్రీంకోర్టులో విషయం తేలకుండా ముఖ్యమంత్రి తన మకాంను విశాఖ మార్చడం సరైన పద్ధతేనా అన్న కామెంట్లు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చన్న క్లాజును ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఉదహరిస్తున్నారు. ఆయనకు అనువుగా ఉన్న చోట ఉండి పాలన చేయవచ్చని నేతలు చెబుతున్నారు.
కీలకం కావడంతో…
మూడు రాజధానుల అంశం 2024 ఎన్నికల్లో కీలకంగా మారబోతుంది. ఏపీకి రాజధాని అంటూ గత ఐదేళ్ల నుంచి కాలం గడుపుతూ దేశంలో ఏపీ పరువు తీస్తున్నారని, లక్షల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టే అమరావతిని నాశనం చేశారని జగన్ సర్కార్ పై చంద్రబాబు తరచూ ధ్వజమెత్తుతున్నారు. జనసేన, బీజేపీలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిని రాజధానిగానే కొనసాగించాలని కోరుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేస్తామని అంటున్నాయి. వైసీపీ ప్రాంతం తమకు మూడు రాజధానులే ముద్దు అంటుంది.
ముహూర్తమే…
ఎన్నికలకు ఇదే కీలక అంశం కావడంతో ముఖ్యమంత్రి జగన్ తనకు తాను పరిపాలన రాజధానిగా ప్రకటించుకున్న విశాఖకు వెళ్లి తీరాల్సిందే. అందుకే ఆయన అక్కడకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. కానీ ముహూర్తం ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యమైన నేతలకు కూడా ఇంత వరకూ సమాచారం లేకపోవడంతో ఇంతకూ సభల్లో చెప్పినట్లు జగన్ సెప్టెంబర్ మాసంలోనైనా విశాఖకు మకాం మారుస్తారా? లేక ముహూర్తాన్ని మరోసారి వాయిదా వేస్తారా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు చివరి నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.