ఏపీలో(AP) ఎన్నికలకు ఏడాది టైమున్నా.. పాదయాత్రలు, వాహన యాత్రలతో పొలిటికల్ సీన్ వేడెక్కుతోంది.వైసీపీ, టీడీపీ, జనసేన ఇప్పటికైతే మూడింటిదీ ట్రయాంగ్యులర్ ఫైటే.. చివరి నిమిషంలో టీడీపీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇస్తే సీన్ ఎలా మారుతుందో తెలీదు.. ఎవరి లెక్కలెలా ఉన్నా.. వైసీపీ మరోసారి గెలుపు కోసం అపోజిషన్ తో పనిలేకుండా దాని ట్రయల్స్ అది చేసుకుంటోంది. ఎలాగైనా గెలుపే లక్ష్యంగా వైసీపీ దాని ప్రయత్నాలు అది చేస్తోంది. ప్రతీరోజు సోషల్ మీడియాలో కవ్వింపు చర్యలు,ప్రతి చర్యలూ మామూలే.. ఓ పక్క లోకేష్, మరోవైపు చంద్రబాబు కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నా టీడీపీ గెలుపు డౌటేనని సర్వేలు కోడై కూస్తున్నాయి.. జగన్ గెలుపు మరోసారి ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అవ్వన్నీ వైసీపీ వాళ్లు డబ్బులిచ్చి కొనుక్కున్న సర్వేలని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు, చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కారణం కావడం విశేషం.బన్నీ హీరోగా జాతీయ అవార్డు పొందిన పుష్ప సినిమాపై ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతోంది. ఆ మూవీ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య సమీకరణాలలోతేడా తెచ్చేదిగా ఉంది.
బాబు గారు కూడా తగ్గరా? (AP)
విషయంలోకి వస్తే బన్నీ నటించిన పుష్ప సినిమా అంతా ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా తీసిన సినిమా. ఇందులో అర్జున్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషఁన్ కు తీసుకు వచ్చినప్పుడు సెట్ ప్రోపర్టీలో సీఎం ఫోటో చంద్రబాబుది పెట్టడం టీడీపీ, వైసీపీల మధ్య గొడవకు కారణమవుతోంది. అసలే ఆత్మరక్షణలో పడిన టీడీపీ తమకు పాజిటివ్ గా ఉండే ప్రతీ అంశాన్ని వాడుకుంటోంది. పోలీస్ స్టేషన్లో సీఐ వెనకాల గోడపై చంద్రబాబు ఫొటో ఉండటాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటోంది టీడీపీ. తాజాగా జాతీయ అవార్డు పొందిన పుష్ప మూవీని కూడా తమ రాజకీయానికి వాడుకోడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. సినిమాలో తన ఫోటోని చూపించడాన్ని వైసీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి ఓ ప్రకటన కూడా చేసేశారు. తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలను సహించలేదని చెప్పేందుకే తన ఫోటో సినిమాలో వాడారంటూ తన థియరీకి బలమైన రీజన్ కూడా జత చేశారు. పైగా ముఖ్యమంత్రిగా తాను చాలా సమర్ధుడననే అర్ధంలోనే అలా ఫోటో వాడి ఉంటారన్నది చంద్రబాబు ఉద్దేశం. అయితే టీడీపీకి మాటకు మాట ఇచ్చే వైసీపీ బాబు ప్రకటనపై రెచ్చిపోయింది.
వైసీపీ థియరీ… (AP)
పుష్ప కథాంశం ఎర్ర చందనం స్మగ్లింగ్ .. అందులో చంద్రబాబు ఫోటోను వాడటమంటే ఆయన హయాంలోనే ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందని చెప్పడమేనని, అదంతా బాబు హయాంలో జరిగిన దోపిడీని చూపించడమేనని వైసీపీ ఎదురు దాడి చేసింది. విదేశాలకు పారిపోయిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి 2019లోనే ఎక్కువ స్మగ్లింగ్ కు పాల్పడినట్లు వార్తలున్నాయి. సో చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం లూటీ జరిగిందని చెప్పడం వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనికి టీడీపీ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.. స్మగ్లర్ల సామాజిక నేపధ్యాన్ని కారణంగా చూపి టీడీపీ గనక ఎదురు దాడి చేస్తే.. అసలు విషయం పక్క దారి పట్టి మళ్లీ కుల సమీకరణలు తెరపైకి వస్తాయి.. పైగా హీరో అల్లూ అర్జున్ సామాజిక నేపధ్యాన్ని బట్టి ఆ వర్గం ఓట్లన్నీ తమవేననే ప్రచారం టీడీపీ చేసుకున్నా ఆశ్చర్యం లేదు.. అదే జరిగితే జనసేన, టీడీపీ ఒకటేనంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి బలం చేకూరుతుంది..
దీని భావమేమి?
పుష్ప మూవీ షూటింగ్ రెండేళ్ల క్రితమే జరిగింది. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది.. కాబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు ఫోటో పెట్టారన్నది రెండు పార్టీల అభిప్రాయం.. అయితే అసలా ఉద్దేశం ఏంటన్నదే ఇప్పుడు పాయింట్.. వైసీపీ, టీడీపీ తమకు తోచినట్లు ఈ సందర్భాన్ని విశ్లేషించుకుంటున్నాయి. ఎవరికి వారు తగ్గేదే లే…అంటూ చెలరేగుతున్నారు.. ఇప్పటికే కులాల వారీగా విడిపోయిన ఏపీలో నేతల కవ్వింపు మాటలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఎక్కడో సినిమాలో ఓ గోడపై ఫొటోపై చంద్రబాబు స్థాయి వ్యక్తి ప్రస్తావన తేవడం అవసరమా? ఏపీలో ప్రస్తుతం ఏదైనా రాజకీయమే..