AP
తెలుగు రాష్ట్రాల్లో సింపతీ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరుకున్నాయ్… రాజకీయ నేతలను జైల్లో పెడితే వాళ్ల వారసులు, కుటుంబం రోడ్లపైకి వచ్చి ప్రజలకు చెప్పుకోవడం అన్నది ఎప్పటినుంచో మొదలైంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో ఆయన కుటుంబం పార్టీ బాధ్యతలను ఎలా భుజాన వేసుకోవాలన్నదానిపై మల్ల గుల్లాలు పడుతోంది. మొదట్లో బాలకృష్ణ చంద్రబాబు సీట్లో కూర్చుని హడావుడి చేసినా కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేదు. కారణం బాలయ్య భాషలో క్లారిటీ ఉండదు… రాజకీయ వ్యూహాలు, తిప్పికొట్టడాలు అసలే రావు. అందుకే కుటుంబం కూడా ఆయన్ను ముందు నిలబెట్టలేకపోయింది.
మరోవైపు లోకేష్ కూడా అంతంత మాత్రమే.. మాట్లాడ్డమే సరిగా రాదు.. పైగా ఇప్పుడు కేసులలో అతనూ జైలు కెళతాడన్న వార్తలు.. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి సింగిల్ సిటింగ్ లోనే పొత్తును ప్రకటించిన పవన్ హై హ్యండెడ్ నెస్ ను చూశాక టీడీపీ కుటుంబంలో గుబులు.. ఎవరిదిపై చేయి కావాలి? ఎవరు తగ్గి ఉండాలి అన్నదానిపైనా నో క్లారిటీ. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలన్న టెన్షన్ , ఎడతెగని చర్చల తర్వాత నందమూరి, నారా ఫ్యామిలీలు వైఎస్ కుటుంబాన్నే ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాయి.
ప్రజలతో మమేకమైన విజయమ్మ, షర్మిల AP
జగన్ ను జైలుకు పంపినప్పుడు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల రోడ్లపైకి వచ్చారు. అవినీతి కేసులు కాదు..రాజకీయ కక్షతో పెట్టిన కేసులని ప్రజలకు వివరించారు. ప్రజల సానుభూతి జగన్ వైపు ఉండేలా వారిని సమాధాన పరచగలిగారు. ఏడాదిన్నర తర్వాత జైలు నుంచి జూలు విదిల్చిన సింహంలా జగన్ బయటకొచ్చారు.. ఇప్పటికీ కేసులతో పోరాడుతున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయం,ఇతర కేసుల్లో తండ్రీ,కొడుకుల పాత్ర గురించి కోర్టులు విచారిస్తాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మాట్లాడుకోనక్కరలేదు…
టీడీపీలో నెంబర్ 2 ఎవరు?
కానీ టీడీపీలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడంపైనే ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు తన హయాంలో తన తర్వాత లీడర్ ను ప్రమోట్ చేయలేదు. పార్టీకి అన్నీ తానే అయ్యారు. దాంతో ఇప్పుడు ఆ కుటుంబం తర్జన భర్జనలు పడుతోంది. లోకేష్ కూడా జైలుకే వెళితే బ్రహ్మణికి పగ్గాలు అప్పచెబుతారన్నది బయట వినిపిస్తున్న టాక్. కానీ ఇప్పుడు ఆమె అత్తగారు, చంద్రబాబు భార్య అయిన భువనేశ్వరి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆలయాల చుట్టూ తిరిగి మొక్కులు మొక్కడంతో పాటు తెలుగు దేశం కార్యకర్తలకు ధైర్య వచనాలు చెప్పే పేరుతో జనం మధ్యకు వస్తున్నారు. ప్రసంగాల్లో చంద్రబాబు ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీన్ చూస్తుంటే అప్పట్లో విజయమ్మ, షర్మిల పడిన కష్టం గుర్తొస్తోంది. ఇప్పుడు అదే సీన్ ను నారా ఫ్యామిలీ ఇమిటేట్ చేస్తోంది.
విజయమ్మ పాత్రని భువనేశ్వరి,షర్మిల పాత్రను బ్రాహ్మిణి పోషించేందుకు ముందుకు వచ్చారు. మొన్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వచ్చి బ్రహ్మణిని కలిసినప్పుడు ఆమె వారితో మాట్లాడటమే కాదు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్లూ చేశారు.. సో బ్రహ్మణి కూడా నెమ్మదిగా స్పీడ్ పెంచవచ్చు. ఈ కుటుంబం రోడ్డుకెక్కి ప్రజల సింపతీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేయవచ్చు.. ఈలోగా బాబు ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై జగన్ ప్రభుత్వం సీరియస్ గానే, కఠినంగానే వ్యవహరిస్తోంది కాబట్టి ముందు ముందు మరిన్న చిక్కులు తప్పక పోవచ్చు. అప్పుడు కూడా వీరిలో ఇంతే స్ఫూర్తి కొనసాగుతుందా అన్నది చూడాలి. ఏదేమైనా చివరకు సంక్షోభ సమయాల్లోనూ టీడీపీ జగన్ కుటుంబాన్నే ఇమిటేట్ చేస్తోందంటూ వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి. ఇమిటేషన్ సంగతి సరే.. ఈ అత్తా కోడళ్ల కష్టం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఓడలు బళ్లు అవుతాయ్.. బళ్లు ఓడలవుతాయ్.. అంటే ఇదేనేమో..