(Ap) ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పటికీ క్లారిటీ రాలేదు.. అమరావతేనని టీడీపీ సహా దాని మిత్ర పక్షాలు డప్పుకొడుతుంటే మూడు రాజధానులే ముద్దు అన్నవైసీపీ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యింది. సెప్టెంబర్ లో విశాఖకు వచ్చేస్తానంటూ సభా ముఖంగా ప్రకటించిన జగన్ కూడా రాజధాని విషయంపై మళ్లీ మాట్లాడటం లేదు.. బహుశా విషయం కోర్టులో పడింది కాబట్టి వైసీపీ శ్రేణులు కూడా తాత్కాలికంగా ఈ వాదనల జోలికి పోవడం లేదు.మరోవైపు విశాఖ పట్నం రాజధానికే జగన్ మొగ్గు చూపుతున్నారన్నది బహిరంగ రహస్యం.. అయితే వేలికేస్తే కాలికి,కాలికేస్తే వేలికి వేస్తూ కోర్టు కేసులు పెడుతూ టీడీపీ రాజధాని మారకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది. రాజధానిపై రాజకీయాల మాట ఎలా ఉన్నా విశాఖ కు సంబంధించి మరో గుడ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
ఐటీ డెస్టినీలుగా విశాఖ, విజయవాడ, తిరుపతి (Ap)
ఏపీలో (Ap) ఐటీలో టాప్ డెస్టినీ ఏదీ అంటే రెండో ఆలోచన లేకుండా విశాఖే నని అందరూ అంటారు. ఇప్పుడు ఈ వాదనలకు తాజా సర్వే మరింత బలాన్నిఇస్తోంది. నాస్కాం డెలాయిట్ సర్వే ఇటీవల దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ ఐటీ సిటీల జాబితా తయారు చేసింది. అందులో దేశంలో మొత్తం 26 నగరాలు ఎంపికైతే అందులో ఏపీనుంచి ఏకంగా మూడు నగరాలకు చోటు దక్కిది. ఐటీ డెస్టినీలో విశాఖ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా తరవాత స్థానాల్లో విజయవాడ, తిరుపతి ఉన్నాయి. ఈ నిర్ణయాలకు కారణాలు కూడా ఆసర్వే వివరించింది. అక్కడ మానవ వనరులు చాలా సులభంగా దొరుకుతాయి. వసతులకు పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు. స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా బానే ఉంది.
ఇక సోషల్ లివింగ్, ఎన్విరాన్ మెంట్ కేటగిరీల్లో కూడా ఈ నగరాలకు మంచి మార్కులే పడ్డాయి .. కారణం ఇక్కడ మధ్య తరగతి జీవులు ప్రశాంతంగా బతికే వీలుంది. ఇన్నాళ్లూ ఐటీ ఉద్యోగాలంటే తెలుగు రాష్ట్రాల వరకూ హైదరాబాద్ ఒక్కనగరానికే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏపీలో విశాఖ నెంబర్ వన్ ఐటీ డెస్టినీగా నిలిచింది. ఇప్పటికే హైదరాబాద్,చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో విస్తరించిన ఐటీ కంపెనీలు తమ తదుపరి డెస్టినేషన్ ను మరింత విస్తరించుకోవాలని చూస్తున్నాయి.అలాంటి కంపెనీలు విజయవాడ, తిరుపతి నగరాల వైపు చూస్తే మాత్రం ఏపీ దశ ఒక్క సారిగా మారిపోతుంది.
సో .. ఈ సర్వే ఫలితాలని ఐటీ కంపెనీలు తీసుకుని కార్యాలయాలు ప్రారంభిస్తే, విజయవాడ, తిరుపతి ఐటీ డెస్టినీలుగా ఎదిగితే అక్కడి స్థానికులకు కావాల్సింది ఏముంది? అప్పుడు ఏపీ పరిస్థితి ఆర్ధికంగా కూడా మెరుగు పడుతుంది. ఇవన్నీ వినడానికి,చెప్పుకోడానికి బాగానే ఉంటాయి. కార్య రూపం దాల్చినప్పుడే నలుగురికీ ఉపయోగపడేది. మిగిలిన రెండు నగరాలలో ఐటీ అభివృద్ధికి టైమ్ పడుతుందేమోకానీ, ఇప్పటికే కొంత పురోగతి సాధించిన విశాఖకు మాత్రం అభివృద్ధి ఇక నల్లేరుపై నడకే అవుతుంది.ఈ పరిణామాలన్నీ గమనించే జగన్ విశాఖను రాజధాని గా చేయాలని పట్టుదలతో ఉన్నట్లున్నారు.ఏమాట కామాట చెప్పుకోవాలి.బీజేపి అధికారంలోకి వచ్చాకే దేశంలో సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రచన జరిగింది. గతంలో కాంగ్రెస్ ఏకీకృత అభివృద్ధి విధానాలు అవలంబించింది.కానీ బీజేపి విస్తరణ అభివృద్ధి పథంతో ముందుకెళుతోంది.అమృత సిటీల పథకం వల్లనే మన ఏపీ నగరాలు కూడా జాతీయ స్థాయి పట్టణాల సరసన చేరుతున్నాయి.
వైఎస్ హయాంలోనే విశాఖకు ఐటీ కళ
వాస్తవానికి విశాఖలో ఐటీ కంపెనీల రాక వైఎస్ హయాంలోనే ప్రారంభమైంది. ఆయన పదవిలో ఉండగానే మధురవాడలో ఐటీ హిల్స్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా విశాఖకు వచ్చేసింది.పెట్టుబడుల పై జరిగిన సదస్సులో అదానీడేటా పార్క్ పెడతామన్న హామీ కూడా కార్యరూపం దాలుస్తోంది..
పెద్ద పెద్ద కంపెనీల రాకను చూసిన రహేజా గ్రూప్ కూడా విశాఖలో తమ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తోంది.