(AP-VIZ)
మూడు రాజధానులపై వైసీపీ కల నిజమవుతోందా? దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ కేబినెట్ ప్రకటించింది. ఈ మేరకు జగన్ కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చింది.ఈసారి దసరా పండగను విశాఖలోనే జరుపుకుందాం అని జగన్ ప్రకటించడం చూస్తే వైసీపీ దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. జగన్ కు టైమ్ కలిసొస్తున్నట్లుగా ఉంది.. విశాఖలో పాలనకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నిర్ణయించిన ముహుర్తం ప్రకారం ముందు సీఎం జగన్ విశాఖకు షిప్ట్ అవుతారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర కార్యాలయాలు ప్రారంభమవుతాయి. విశాఖకు తరలించాల్సిన కార్యలయాల జాబితా రూపొందంచడానికి ఒక కమిటీని నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కమిటీ సూచన మేరకు ఆఫీసులు ఏర్పాటవుతాయి. రుషి కొండ పరిసరాల్లో సీఎం ఆఫీస్, ఇల్లు నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చేనెలలో దసరా పండగ నాడు సీఎం విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మంత్రులు కూడా షిఫ్ట్ అవుతారు. అయితే శాసన రాజధాని మాత్రం అమరావతేనని స్పష్టం చేశారు. రేపటినుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
కేసులతో అడ్డుకున్న టీడీపీ (AP-VIZ)
విశాఖను రాజధానిని చేయాలన్నది వైసీపీ చిరకాలపు కల.. అందుకే మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. అయితే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేన అమరావతి రైతులకు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని ఎగదోశాయి. పై పెచ్చు కోర్టుపరమైన కేసులతో విశాఖకు రాజధాని తరలి పోకుండా అడ్డుకున్నాయి. సీఎం విశాఖ రాజధాని అని ప్రకటించిన మరు నిమిషం నుంచీ దానిపై కేసులు వేయడం అవి విచారణలో నత్తనడకన సాగడంతో, ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకునే వీలు లేకపోయింది. ఇప్పుడు చంద్రబాబు జైలు పాలవడంతో వైసీపీకి పంటి కింద రాయిలా తయారైన కీలక అడ్డంకి తొలగిపోయినట్లు అయ్యింది. అమరావతికి పెట్టే ఖర్చులో పదోవంతు ఖర్చుతోనే విశాఖ ముంబై నగరం అంత ఎత్తుకు ఎదుగుతుందని, మౌలిక వసతులు అక్కడ పుష్కలంగా ఉన్నాయని వైసీపీ మొదట్నుంచి వాదిస్తోంది. అయితే అమరావతి రాజధానిని మొదట సమర్ధించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలు రావడంతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది వైపీసీ ప్రభుత్వం.
దేనికైనా రెడీ!!! (AP-VIZ)
ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ముందస్తు వచ్చినా, జమిలి ఎన్నికలు పెట్టినా సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించారు. రాజధాని విషయంలో జగన్ అభీష్టాన్ని కేంద్రం మన్నించినందున ఎన్నికలెప్పుడోచ్చినా రెడీయేనని అభ్యంతరం పెట్టరాదని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.. అందుకే పార్టీ నేతలందరూ ఇకపై మరింత క్రియాశీలకంగా ప్రజల మధ్యే ఉండాలని ప్రతిపక్షాలను ఎండగట్టాలని మార్గ నిర్దేశం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలుకెళ్లడంతో వైసీపీ సమరోత్సాహంతో అడుగులేస్తోంది. వై నాట్ 175 నినాదంతో ఇప్పటికే జగన్ దిశా నిర్దేశం చేశారు. మంత్రులు, పార్టీ నేతలు గడప గడపకు కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు.సంక్షేమ పథకాలు, బలహీన వర్గాలకు ఉచిత నగదు పంపిణీ తమను గెలిపిస్తాయని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.
డీలాపడిన టీడీపీ
అమరావతి రాజధానిగా ఉంచాలంటూ యుద్ధం చేస్తున్న టీడీపీ చంద్రబాబు జైల్లో ఉండటంతో నిరాశలో పడిపోయింది. దిశానిర్దేశం చేసే నేత జైల్లో ఉండటం, జనసేనతో పొత్తు ఏమేరకో నిర్ణయం తేలకపోవడంతో ,క్షేత్ర స్థాయిలో సమస్యలతో , చెదురుతున్న కేడర్ తో టీడీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. త్వరలో మరిన్ని అరెస్టులు తప్పవన్న ప్రభుత్వం సంకేతాలతో టీడీపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయి. అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ వాణిని వినిపించాలని టీడీపీ నిర్ణయించుకుంది. అడ్డంకులెన్ని ఎదురొచ్చినా అధిగమించాలని, అవమానాలెదురైనా భరిద్దామని టీడీపీ నేత లోకేష్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కొసమెరుపు…
మూడు రాజధానులపై రెండేళ్లుగా జగన్ విడతల వారీగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వచ్చింది. కోర్టుల్లో కేసులు తేలకపోవడం వల్ల ఈ విషయం పెండింగ్ లో పడుతూ వస్తోంది. మరిప్పుడు జగన్ ప్రకటన ఈసారైనా కార్యరూపం దాల్చుతుందా? వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల రాజధాని మార్పుకి ఇక అడ్డంకులు ఉండవన్న ధీమాతోనే వైసీపీ ఈప్రకటన చేసిందా? లేక కేంద్రం నుంచి మరేదైనా భరోసా వైసీపీ ప్రభుత్వానికి దక్కిందా అన్నది తెలియ రాలేదు.