(APS)
ఒక పార్టీ టిక్కెట్ మీద గెలిచినప్పుడు ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. నచ్చకపోతే రాజీనామా చేయాలి. లేకుంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి తన నిరసనను తెలియచేసినా ఫరవాలేదు. కానీ నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణంరాజు రూట్ సపరేటు. ఆయన వైసీపీ టిక్కెట్ మీద గెలిచినా టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం చూసే వారికే బాగాలేదు. అంతెందుకు పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయవచ్చు. మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవవచ్చు. అలాగే వైసీపీ హైకమాండ్ కూడా ఆయనపై చర్యలు తీసుకోవచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు. ఈ రెండూ జరగడం లేదు. చూసేవారికి మాత్రం రాజకీయంగా ఎబ్బెట్టుగా మారింది.
మూడున్నరేళ్ల నుంచి…
రఘురామ కృష్ణంరాజు గత మూడున్నరేళ్ల నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అలాగే పార్టీ కూడా ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన వైసీపీ హైకమాండ్ మాత్రం రఘురామ కృష్ణంరాజు విషయంలో చూసీ చూడనట్లు కొన్నేళ్ల నుంచి వదిలేసింది. ఇది పార్టీ అభిమానులతో పాటు కార్యకర్తలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వినోదంగా మారడంతో మిగిలిన రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఏపీలో పార్లమెంటు ఉప ఎన్నిక కోసం ఏ పార్టీ సిద్ధపడక పోవడమే ఈ పరిణామమని చెప్పాల్సి ఉంటుంది.
డెడ్ లైన్ పెట్టినా… (APS)
ఎంపీగా రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో తాను రాజీనామా చేస్తున్నట్లు పలు డెడ్ లైన్లు పెట్టారు. కానీ ఆ మేరకు ఆయన రాజీనామా చేయలేదు. అలాగే రాజు మీద అనేక కేసులు నరసాపురంలో బుక్ అయ్యాయి. వైసీపీ క్యాడర్ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గత మూడేళ్ల నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. రాజుగారికి నిజంగా పౌరుషం ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతుంటే, దమ్ముంటే తనపై సస్పెన్షన్ వేటు వేసి చూడమని రఘురామ కృష్ణంరాజు ఛాలెంజ్ విసరడం సాధారణంగా మారింది. కానీ ఎవరూ ఏ పనీ ఇంత వరకూ చేయలేదు. పైగా రచ్చ బండ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దానికి ఖండనలు మినహా చర్యలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి లేకపోవడం విశేషం.
చంద్రబాబుతో కలసి…
తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కూడా రఘురామ కృష్ణంరాజు ప్రధానంగా కనిపించారు. విమానాశ్రయానికి వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈరోజు జరిగిన ఎన్టీఆర్ వెండి నాణెం విడుదల కార్యక్రమంలో కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. రఘురామ కృష్ణంరాజు ఎంత రెచ్చగొట్టినా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే మరింత రెచ్చిపోతారని వైసీపీ హైకమాండ్ భావిస్తుందంటారు. కానీ ఆయన పార్టీలో కొనసాగుతూ ఫ్యాన్ పార్టీని విమర్శిస్తుంటే ఏరకంగా వినసొంపుగా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ఇక పది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఇరువురూ తమ పని తాము చేసుకుని పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు నరసాపురం నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని పసుపు పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. సాధారణంగా వైసీపీ అధినేత జగన్ థిక్కార స్వరాన్ని సహించరన్న పేరుంది. కానీ రఘురామ కృష్ణంరాజు విషయంలో మాత్రం ఆయన వైఖరి మాత్రం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. (APS)