auto accident vizag
రోడ్డు ప్రమాదాలు పసి పిల్లల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఏపీలో ఒకే రోజు రెండుచోట్ల.. ఇంచు మించు ఒకే టైమ్ లో రెండు ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రాణాపాయం జరగలేదు గానీ స్కూలు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయమే స్కూళ్లకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన వారు యాక్సిడెంట్ దెబ్బకు రక్తమోడుతూ రోడ్డుపై పడిపోయారు. విశాఖ సంగం శరత్ జంక్షన్ దగ్గర సిగ్నల్ లో స్లోగా వెళుతున్న లారీని పక్క నుంచి వేగంగా ఆటో ఢీకొంది. ఆ ఆటోలో ఇంచుమించు ఏడెనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ప్రాణాలు పోలేదు కానీ ప్రాణం పోయినంత పనైంది. ఆటో తిరగబడి పోవడంతో దాని కింద పిల్లలు నలిగిపోయారు. కొందరికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. సరిగా ఇదే టైమ్ లో మధురవాడ దగ్గర స్కూలు పిల్లలను తరలిస్తున్న ఆటోకు పంది అడ్డం రావడంతో డ్రైవర్ సెడన్ బ్రేక్ వేశాడు. దాంతో ఆటో బోల్తా ప డింది.
ట్రాఫిక్ లేకపోవడంతో తప్పిన ముప్పు auto accident vizag
రెండు ఘటనలు ఇంచుమించు ఒకలాగే జరిగాయి. కాకపోతే సంగం శరత్ దగ్గర జరిగిన ఘటన అత్యంత ప్రమాదకరమైనది. అసలే మెయిన్ రోడ్డు.. కాకపోతే ఉదయమే కావడంతో ట్రాఫిక్ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. సిగ్నల్ దగ్గర బ్రేకుల్లేకుండా అంత వేగంగా వాహనాన్ని నడపడం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే. సీసీ టీవీ ఫుటేజ్ లో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాద సమయానికి ఆటో రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు వెళుతోంది. లారీని ఢీ కొట్టాక మూడు పల్టీలు కొట్టి , సుమారు వంద మీటర్ల దూరం డేక్కుంటూ వెళ్లి ఆగింది. ఆటో బోర్లా పడటంతో దాని కింద పిల్లలు నలిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టు పక్కల వారు పరుగెత్తుకు వచ్చి ఆటోను తిరగేసే ప్రయత్నం చేశారు. కానీ అతికష్టం మీద ఆటోను తీయగలిగారు. ప్రమాద సమయానికి ఆటోలో ఎనిమిది మంది విద్యార్ధులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
భీతావహంగా ఘటనా స్థలం
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు ఘటనా స్థలానికి వచ్చి రక్తం మడుగులో పడి ఉన్న పిల్లలను చూసుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. గాయపడిన వారిని సమీపంలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్, క్లీనర్, ఆటో డ్రైవర్ లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎన్నిసార్లు చెప్పినా ఆటో డ్రైవర్ల అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాద సమయానికి డ్రైవర్ కాకుండా క్లీనర్ లారీని నడుపుతున్నట్లు తెలుస్తోంది.
లారీ ఆ టైమ్ లో ఎలా?
సాధారణంగా ఉదయం పది గంటలు దాటిన తర్వాతే భారీ వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తారు. కానీ ఈ లారీ ఆ టైమ్ లో అలా ఎలా వెళుతోందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరామర్శించారు. చికిత్సలో ఎలాంటి తాత్సారం లేకుండా చూడాలని ఆదేశించారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకోవడం, అతివేగంగా నడపడం, ఆటోలు కండిషన్ లో లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆటోలను సీజ్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం పట్ల కూడా విమర్శలు తలెత్తుతున్నాయి.
auto accident vizag