రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పుపై తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణులను అయోమయంలో పడేశాయనే చెప్పాలి. అధ్యక్షుల పదవీ కాలం పూర్తయింది కాబట్టి మార్చ వచ్చు.కానీ రెండు రాష్ట్ర్రాల్లో ఎంపికపై మాత్రం సొంత గూటి నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో పార్టీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో అధ్యక్ష నియామకాలు పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడక పోగా, తమ ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి ఆయన స్థానంలో పురంద్రీశ్వరిని నియమించారు. ఇది ఎవరికి ఉపయోగం అన్నది అర్థం కాక తలలు పీక్కుంటున్నారు.
పురంద్రీశ్వరి నియామకం…
సోము వీర్రాజును తప్పించడం అంటే సరే.. జగన్ కు అనుకూలంగా ఉంటారన్న విమర్శల నుంచి కొంత ఉపశమనం లభించినా పురంద్రీశ్వరిని అధ్యక్షురాలుగానియమించడం మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగానే జరిగిందన్నది క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట. కేవలం కమ్మ సామాజికవర్గం ఓట్లను చీల్చడానికి, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు పదవి ఇస్తే ఏపీలో పార్టీ మరింత బలపడుతుందన్న విషయంలో నిజం లేదంటున్నారు. ఈ నియామకంతో చంద్రబాబు పార్టీతో పొత్తు కూడా అనుమానమేనన్నది స్సష్టమవుతుంది. జగన్ కు పరోక్షంగా మేలు చేయడానికే పురంద్రీశ్వరి నియామకం జరిగిందని, మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్నది ఎక్కువ మంది వినిపిస్తున్న కామెంట్స్.
గతంలో కాపుల కోసం…
కాపు ఓట్ల కోసం గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులను పార్టీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. కానీ ఇప్పుడు జనసేన తమతో ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును మార్చడం అనివార్యమని సమర్థించుకోవచ్చు.కానీ బీసీలు ఎక్కువగా ఉన్నరాష్ట్రంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమిస్తే తప్పేంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను నియమిస్తే జగన్ కు ఇబ్బంది అని భావించి చంద్రబాబును పరోక్షంగా దెబ్బతీయడానికే చిన్నమ్మ నియామకం చేపట్టారన్నది రాజకీయాల పార్టీల నేతలతో పాటు విశ్లేషకుల ఒపీనియన్ కూడా అదే. అందువల్ల పురంద్రీశ్వరి నియామకంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగుతుందన్నది దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది.
బండి నియామకం తర్వాత…
ఇక తెలంగాణలోనూ బీజేపీ అదే తరహాలో నియామకం చేపట్టింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా నియాకం జరిగిన తర్వాతే రాష్ట్రంలో పార్టీ కొద్దో గొప్పో బలపడిందని చెప్పాలి. బండి సంజయ్ ప్రసంగం పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆయన పనితీరును చూసి కొంత పాజిటివ్ టాక్ కమలం పార్టీకి చేకూరింది. కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపారు. కేసీఆర్ ను ఎదుర్కొనడంతో పాటు ప్రభుత్వానికి చికాకు పుట్టించడంలో బండి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలు కొంత అధికార బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాయి. మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన పేషీలో ఉన్నవారిపై ఆరోపణలు చేయడమే కాకుండా పలుమార్లు అరెస్ట్ అయి కొంత సానుభూతి కూడా సంపాదించుకున్నాడు.
బరి నుంచి తప్పుకున్నట్లేనా?
బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ ను నియమిస్తారని అందరూ భావించారు. బీసీ ఓట్ల కోసమైనా బీజేపీ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందని ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా కిషన్ రెడ్డిని మళ్లీ నియమించారు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను నియమించారన్న విషయం క్యాడర్ తో పాటు జనానికి అర్ధమయింది. ఎదగడానికి అవకాశమున్న రాష్ట్రంలోనూ కమలం పార్టీ అధినేతలు కేసీఆర్ కు బి టీమ్ గా వ్యవహరిస్తున్నారంటూ సొంత నేతలే గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడినట్లు కనిపించినా నేతలు ఎవరూ అటు వైపు చూడకపోవడానికి కారణం కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందమన్న విషయం అవగతమైందని, అందుకే చేరికలు అంటూ లేకుండా పోయాయన్నది వాస్తవం. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందన్నది వాస్తవం. ఎన్నికలకు ముందే బరి నుంచి కమలం పార్టీ తప్పుకుందన్న కామెంట్స్ సొంత పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయంటే ఆ పార్టీ పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Follow Us On : YouTube , Google News