భారతీయ జనతా పార్టీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. దక్షిణాదిని లక్ష్యంగా చేసుకుని కమలనాధులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యూహాలను రచిస్తున్నారు. మోదీ దక్షిణాది రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వారణాసి తో పాటు సౌత్ లో కూడా పోటీ చేస్తే బీజేపీ కొంత పుంజుకుంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణాదిన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఇంకా ఖరారు కాకపోయినప్పటీకి మోదీ ఈసారి మాత్రం తమిళనాడు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వీక్ గానే…
దక్షిణ భారత దేశంలో కమలం పార్టీ బలహీనంగా ఉంది. అది అందరూ అంగీకరించాల్సిన అంశమే. కర్ణాటక మినహా మరే ఇతర రాష్ట్ర్రంలోనూ బీజేపీ బలంగా లేదు. అదే సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం సౌత్ లో బలంగా ఉంది. తొలి నుంచి సౌత్ హస్తం పార్టీకి అండగా నిలుస్తుంది. ఉత్తర భారత పార్టీగా భావించడం, సంప్రదాయాలు, సంస్కృతిలో తేడా ఉండటం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భావించడం వంటి కారణాలతో పాటు ఇటువైపు పెద్దగా మతతత్వ రాజకీయాల ప్రభావం అంతగా ఉండబోదు. అయితే ఈసారి ఉత్తర భారత దేశంలోనూ బీజేపీకి గతంలో వచ్చిన స్థానాలు నిలుపుకునే అవకాశాలు లేవు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కమలనాధులు సౌత్ పై ఫోకస్ పెట్టారు.
తమిళనాడు నుంచి…
కేరళలోని వాయనాడ్ నుంచి గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచారు. అమేధీలో మాత్రం ఓటమిపాలయ్యారు. మోదీ కూడా ఉత్తరాదిన ఉన్న వారణాసితో పాటు తమిళనాడు నుంచి పోటీ చేస్తే సౌత్ లో పార్టీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. తమిళనాడులో కొంత అడ్వాంటేజీ ఉన్నట్లు గుర్తించిన కమలనాధులు మోదీ గెలవగలిగిన నియోజకవర్గాన్ని ఇప్పటి నుంచే వెతికే పనిలో ఉన్నారు. ఈ పనిని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో మోదీ పోటీ చేస్తే ఆ ప్రభావం కర్ణాటక, కేరళతో పాటు ఏపీ, తెలంగాణలపై కూడా పడుతుందని భావిస్తున్నారు. అందుకోసమే మోదీ తమిళనాడును ఎంచుకున్నారు.
బలహీన పర్చేందుకు…
అందుకోసమే దక్షిణాది రాష్ట్రాల్లో మహారాష్ట్రను కూడా కలిపి బీజేపీ నేతలు ప్రత్యేక స్ట్రాటజీని రూపొందిస్తున్నారు. మొత్తం 170 ఎంపీ స్థానాలను వచ్చే ఎన్నికలలో సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పాత మిత్రులను కూడా కలుపుకుని పోయేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 29 స్థానాలు మాత్రమే దక్షిణాది నుంచి ఉన్నాయి. అందులో అత్యధిక స్థానాలు కర్ణాటకలోనివే. నాలుగు తెలంగాణ నుంచి ఉన్నాయి. ఇక ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకే సౌత్ పై కమలం పార్టీ గురి పెట్టిందంటున్నారు. ఈ రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా సౌత్ పై దృష్టి పెట్టినట్లు తెలిసింది. మరి ఉత్తర భారత దేశ పార్టీ ముద్రపడిన పార్టీని దక్షిణాది ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది కాలమే చెప్పాలి.