ఉజ్జయినీ మహంకాళి బోనాల వేడుకలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రంగం కార్యక్రమం కూడా పూర్తయింది. జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. మధ్యాహ్నం తొట్టెల ఊరేగింపు జరగనుంది. ఆదివారం లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉజ్జయినీ మహంకాళీ బోనాల వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది.
ఇచ్చిన మాటను…
ఈరోజు జోగిని స్వర్ణలత భవిష్యవాణిని చెప్పారు. భక్తుల నుంచి పూజలను సంతోషంగా అందుకున్నానని అన్నారు. అయితే గత ఏడాది తనకు ఇచ్చిన మాటను ఎందుకు మర్చి పోయారంటూ ప్రశ్నించారు. కావల్సినంత బలాన్ని ఇచ్చానన్నారు. మీతోనే తాను ఉంటానని, వర్షాలు వస్తాయని, కొంచెం ఒడిదుడుకులు ఎదురవుతాయని చెప్పారు. తన వద్దకు వచ్చే వారిని చల్లగా చూసుకుంటానని తెలిపారు. ఐదు వారాల పాటు తనకు సాక పోయాలని, కొంత ఆలస్యమయినా వర్షాలు తప్పక కురుస్తాయని స్వర్ణలత భవిష్యవాణిలో వివరించారు.