కర్ణాటక రాజకీయాలు మళ్లీ మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. దక్షిణాదిన పార్లమెంటు ఎన్నికల్లో బలం పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏకపక్షంగా ప్రజలు అధికారాన్ని అప్పజెప్పారు. అప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీని కన్నడ ప్రజలు తిరస్కరించారు. జనతాదళ్ ఎస్ ను కూడా దరి చేరనివ్వలేదు. జేడీఎస్ ప్రాబల్యం ఉన్న పాత మైసూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారు. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కే అధిక స్థానాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతుంది.
దక్షిణాదిన…
తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్ర్రాల్లో బీజేపీకి అంతగా బలం లేదు. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నప్పటికీ ఒకటి అరా స్థానాలు తప్పించి అంతకు మించి ఆశ అయితే పార్టీ నాయకత్వానికి లేదు. తెలంగాణలో రెండంకెల లోక్ సభ స్థానాలు వస్తాయని భావిస్తున్నా అది కూడా సాధ్యం కాదు. గతంలో నాలుగు లోక్ సభ స్థానాలు రావడంతో ఈసారి మరో ఒకటి రెండు స్థానాలు పెరగడమూ, తగ్గడమూ జరగొచ్చు. అందుకే దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ కర్ణాటక పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అక్కడ బలమైన ఓటు బ్యాంకు సొంతంగా ఉండటంతో అక్కడే అత్యధిక స్థానాలు దక్కించుకోవాలన్న
గత ఎన్నికల్లో…
కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలున్నాయి. గత లోక్ సభ ఎన్నికలలో ఇక్కడ 25 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దక్షిణాదిన అత్యధిక లోక్ సభ స్థానాలు సాధించిన రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నాయకత్వం కర్ణాటక పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హామీల అమలులో కొంత ప్రజల్లో అసహనం కనిపిస్తుంది. ప్రధానంగా విద్యుత్తు చార్జీల రేట్లు పెంచడం, మహిళలకు ఉచిత ఆటోలు, నిరుద్యోగ భృతి వంటి విషయాల్లో ఎన్నికల సమయంలో చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసిందొకటి. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత కనిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
పొత్తుతో వెళ్లేందుకు…
అందుకే అక్కడే మరోసారి అధిక స్థానాలను సంపాదించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా జేడీఎస్ ను కలుపుకుని లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సమాయత్తమవుతుంది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జేడీఎస్ అధినేత కుమారస్వామితో మంతనాలు జరుపుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కుమారస్వామి కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెడతానంటూ ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నారు. జేడీఎస్ తో కలసి వెళితే తమ బలం పెరిగే అవకాశముందన్న అంచనాలో కమలం పార్టీ ఉంది. గతంలో కుమారస్వామితో బీజేపీ స్నేహం ఉంది. మరోసారి జేడీఎస్ తో లోక్ సభ ఎన్నికల్లో కొనాసాగేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతుంది. జేడీఎస్ కు పట్టున్న ప్రాంతాల్లో బీజేపీ కూడా చేయి కలిపితే ఖచ్చితంగా కాంగ్రెస్ ను దాటేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కుమారస్వామి అండ్ కో కూడా ఈ ప్రతిపాదనకు ఓకే అని చెప్పక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.
Follow Us On : YouTube , Google News