BJP
అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జాతీయ నేతల విగ్రహాలు ప్రతిష్టస్తూ హడావుడి చేసిన బీజేపి(BJP) ఇప్పుడు సనతాన ధర్మ ప్రచారం వైపు అడుగులేస్తోంది. మొదట్లో గుజరాత్ సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత పొడవైన ఉక్కు విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఇదో ప్రపంచ వింతగా వార్తలకెక్కింది. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న నరంద్ర మోడీ సనాతన ధర్మ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నారా? అందుకే హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్ట చేస్తే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారా? సనాతన వాదాన్ని ఎవరు విమర్శించినా గట్టిగా బదులిమ్మని మంత్రులకు ఆదేశించడం చూస్తుంటే ఈ సారి ఎన్నికలు దీని చుట్టూనే తిరుగుతాయనిపిస్తోంది. బీజేపి ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నా… జాతికి మార్గదర్శకులుగా నిలబడిన వారి విగ్రహాల ఏర్పాటు మంచిదేననే వాదనలు వినిపిస్తున్నాయి.
దక్షిణాదిన సమతామూర్తి విగ్రహం
రంగా రెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా… బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్, టైటానియం తో సమతా మూర్తి విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ విగ్రహాన్ని చైనాలోని ఏరోసన్ కార్పోరేషన్ సంస్థ తయారుచేసింది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా దీనిని నామకరణం చేశారు. ముచ్చింతల్ లోని 45 ఎకరాల స్థలంలో దీని నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే కూర్చుని ఉన్న విగ్రహాల్లో ఇది రెండో అతి పెద్దది కావటం విశేషం. కులమతాలకతీతంగా మననుఘలంతా ఒక్కటేనని చాటిన ఐక్యతా మూర్తి రామానుజుడు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ విగ్రహ స్థాపన జరిగింది.
ఆదిశంకరాచార్యకు అరుదైన గౌరవం (BJP)
పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఓంకారేశ్వర్ లో శివుణికి ఎంతో పవిత్రమైన క్షేత్రం. అంతటి పవిత్ర స్థలం లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈనెల 18న ఆవిష్కరించారు. ఇండోర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర్ లో నర్మదా నది ఒడ్డున మాంధాత పర్వతం పై స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ చేశారు. 8వ శతాబ్దపు వేద పండితుడయిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని మైసూర్ శిల్పి యోగిరాజ్ మరో 9 మంది కళాకారులతో, అతని కుమారుడు అరుణ్ సహాయంతో అద్భుతమైన విగ్రహాన్ని చెక్కారు. ఓంకారేశ్వర్ లో అద్వైత లోక్ పేరుతో మ్యూజియం, ఆచార్య శంకర్ ఇంటర్నేషనల్ అద్వైత వేదాంత ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు 36 హెక్టార్లలో అద్వైత వనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
విగ్రహ తయారీ ఎలా?
ఆదిశంకరాచార్య విగ్రహం బహుళ లోహాల సమ్మేళనంతో తయారు చేయబడింది. విగ్రహం 54 అడుగుల ఎత్తైన పీఠం పై ఉంది. దీనికి ఏకాత్మతా కీ ప్రతిమా అని నామకరణం చేశారు. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సాధువులు హాజరయ్యారు. గతంలో మధ్యప్రదేశ్ లోని బీజేపి BJP ప్రభుత్వం ఓంకారేశ్వర్ లోని మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం 2,141.85 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
ఆది శంకరాచార్య జననం, సన్యాసం (BJP)
కేరళలో జన్మించిన ఆదిశంకరాచార్య చాలా చిన్న వయస్సులో సన్యాసం తీసుకున్న తర్వాత ఓంకారేశ్వర్ కు చేరుకున్నారని నమ్ముతారు. అక్కడ అతని గురువైన గోవింద్ భగవత్ పాద్ ను కలుసుకున్నాడని అక్కడే నాలుగు సంవత్సరాలు ఉండి విద్యను అభ్యసించాడని చరిత్ర చెబుతోంది. శంకరాచార్య అద్వైత వేదాంత తత్వాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి 12 సంవత్సరాల వయస్సు లో ఓంకారేశ్వర్ విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతారు. దేశవ్యాప్తంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు శంకరచార్యులు. ఈ సిద్ధాంతాన్ని కాలి నడకలో తిరుగుతూ ప్రచారం చేసి అందుకు అవసరం అయిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు.