Brics Summit 2023 (South Africa): BRIC అనే పదాన్ని ముందుగా 2001 లో అప్పటి గోల్డ్ మ్యాన్ సాచ్స్ (Goldman Sachs) చైర్మన్ అయిన జిమ్ ఓ నీల్ విదేశీ పెట్టుబడులకు వ్యూహాలకు సంబందించి ప్రచురించిన “బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్స్” అనే ఒక రిపోర్ట్ లో మొదటిసారిగా తెరపైకి తెచ్చారు. BRIC (Brazil Russia India China) అనే పదాన్ని అదే రిపోర్ట్ తయారీలో సహాయకురాలిగా పని చేసిన రూప పురుషోత్తమన్ ప్రతి పాడించారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి ఈ నాలుగు BRIC దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మారుతాయని గోల్డ్ మ్యాన్ సాచ్స్ అంచనా వేసింది. 2010 లో BRIC గ్రూపులోకి సౌత్ ఆఫ్రికా చేరిక తర్వాత నుంచి BRICS గా రూపాంతరం చెందింది.
BRICS దేశాలు ప్రపంచ జనాభాలో 41.5% మరియు ప్రపంచ భూ ఉపరితలం(Land Mass)లో 26.7% కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బ్రిక్స్ లో భాగంగాఉన్న 5 దేశాలు G20 గ్రూప్ లోకూడా సభ్యులుగా కొనసాగుతున్నారు. బ్రిక్స్ దేశాల మొత్తం జీడీపీ దాదాపుగా US$28.06 ట్రిలియన్ గా ఉంది. ఇది ప్రపంచ జీడీపీ లో దాదాపు 26.6% గా ఉంటుంది మరియు బ్రిక్స్ దేశాల విదేశీ నిల్వలు 2018 నాటికి దాదాపుగా US$4.46 ట్రిలియన్ల ని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
BRICS దేశాల 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికన్ దేశంలోని జొహాన్నెస్ బర్గ్ లో జరగనున్నాయి. యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో బ్రిక్స్ సమావేశాలకు మొదటిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ విస్తరణకు సంబందించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారని సమాచారం.
బ్రిక్స్ లో చేరాలని 40 దేశాల ప్రయత్నాలు..!
బ్రిక్స్ లో సభ్యత్వం కావాలని ఇప్పటికే 40 కి పైగా దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. 2017 సెప్టెంబర్ లో చైనా వేదికగా జరిగిన BRICS దేశాల 9వ వార్షిక శిఖరాగ్ర సమావేశాలలోనే ఈజిప్ట్, కెన్యా, తజికిస్తాన్, మెక్సికో మరియు థాయిలాండ్ దేశాలను బ్రిక్స్ కూటమిలో చేరాలని చైనా ఆహ్వానించింది. అంతకముందు సంవత్సరం 2016 లో భారత్ లో జరిగిన Brics Summit సమావేశంలో భారత్ తన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బాంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక మరియు మయన్మార్ దేశాలను బ్రిక్స్ సమావేశాలలో పాల్గొనాలని ఆహ్వానించింది.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలలో అప్పటినుంచే కొత్త సభ్యుల చేరికల పై చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బ్రిక్స్ దేశాల ఆర్థిక బలోపేతానికి 2015లో BRICS NDB (New Development Bank)స్థాపించగా, 2021లో కొత్తగా బాంగ్లాదేశ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను సభ్యులుగా చేర్చుకున్నారు. 2023లో ఆఫ్రికన్ దేశమైన ఈజిప్ట్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సభ్యత్వాన్ని తీసుకుంది. దీంతో బ్రిక్స్ బ్యాంకు లో సభ్య దేశాల సంఖ్య 8కు చేరుకుంది.
సౌత్ ఆఫ్రికాలో ఈ సంవత్సరం జరగనున్న 15 వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందుగానే, సౌదీ అరేబియా, యూఏఈ, బహరేన్, అల్జీరియా, ఇరాన్, ఈజిప్ట్, ఇరాన్, ఆర్జెంటినా మరియు ఇండోనేషియా వంటి దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాలని అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాయి.