మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానే సమీపంలో ఎక్స్ప్రెస్ హైవే గడ్డర్ కూలి పదహారు మంది కార్మికులు మరణించారు. మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ పై గడ్డర్ అమరుస్తుండగా ఒక్క సారిగా కూలిపోవడంతో దాని కింద పడి కార్మికులు మృతి చెందారు.
ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో…
సర్లంబే వద్ద సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పదహారు మంది కార్మికులు మరణించగా ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది శిధిలాల కింద చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సిబ్బంది శ్రమించారు. దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
మృతుల సంఖ్య…
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమా? అన్న రీతిలో విచారణ చేస్తున్నారు. ఘటన స్థలిని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సాయాన్ని ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది.