దక్షిణాఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఈ ప్రమాదంలో యాభై మంది వరకూ సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి పెద్ద భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని యాభై రెండు మంది వరకూ మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జోహెన్స్ బర్గ్ లోని బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ భవనంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉండటంతో బయట ప్రపంచానికి తెలియడం ఆలస్యమైంది. అయినా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడం వల్ల నష్ట తీవ్రత తగ్గించగలిగామని అధికారులు చెబుతున్నారు.
కారణాలు మాత్రం…. (fire accident)
అయితే అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. తెల్లవారుజామున జరగడంతో అందరూ నిద్రమత్తులో ఉండటంతో మంటలు వ్యాపించడం తెలియక అందులోనేచిక్కుకుుపోయారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు చేపట్టారు.
అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత భవనంలో భయానక పరిస్థితులను చూసిన వారికి కంటనీరు తెప్పించాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే యాభై రెండు మంది మృత్యువాత పడ్డారు. మంటలతో పొగ భవనంలో అలుముకోవడంతో కొందరు ఊపిరాడక చనిపోయారని, మరికొందరు మంటల్లో చిక్కుకుని మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎక్కడ చూసినా…
ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఎక్కడ విన్నా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. తమ వారిని కోల్పోయిన అనేకమంది చూసేందుకు కూడా మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకడం లేదని కొందరు వాపోతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నా పొగ భవనం లోపల అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది అందులోకి సులువుగా వెళ్లలేకపోతున్నారు.
ఈ ప్రమాదంలో నలభై మూడు మంది వరకూ గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తెల్లవారు జామున కావడంతో ఇంకా భవనంలోపు ఎంత మంది ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు.
మృతుల సంఖ్య… (fire accident)
అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకూ యాభై రెండు మృతదేహాలను మాత్రమే బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ భవనంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లీజు ఒప్పందాలు లేకుండానే ఆ భవనంలో చాలా మంది నివాసముంటున్నారని ఎమెర్జెన్సీ మేనేజ్ మెంట్ సర్వీసెస్ అధికారులు తెలిపారు.
దాదాపు రెండు వందలకు మందికి పైగా భవనంలో నివాసం ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ సంఖ్యలో మృతి చెందడంతో ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ భవనంలో అగ్నిప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాధమిక అంచనా వేస్తున్నప్పటికీ, అగ్నిమాపక శాఖ లోతైన దర్యాప్తు జరిపిన తర్వాత కాని అసలు విషయం వెల్లడి కానుంది.