రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. రెండు బస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 21 మంది తీవ్రగాయాలపాలలయ్యారు. మహారాష్ట్రలోని బుద్దానాలో ఈ ప్రమాదం సంభవించింది. మల్కాపూర్ ఏరియాలో ఉన్న నందూర్ నాకా ఫ్లైఓవర్ పై రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. హింగోలి జిల్లాకు వెళుతున్న బాలాజీ ట్రావెల్స్ బస్సు, నాసిక్ వెళుతున్న రాయల్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నారు.
ఓవర్ టేక్ చేయబోయి…
నాకా వద్ద బస్సును ఓవర్ టేక్ చేయబోయి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన 21 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు ప్రయాణికులకు ప్రాధమిక చికిత్స అందించి పంపించి వేశారు. ఈ ఘటనతో ఆ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే వెంటనే పోలీసులు రెండు బస్సులను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియోను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాధ్ షిండే వైద్యులను ఆదేశించారు.