9
ఓ సాధారణ కారు డ్రైవర్ ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? అసలు ఒకళ్ల ఎక్కౌంట్ లోకి ఊహించనంత సొమ్ము హటాత్తుగా వచ్చి పడిపోడం సాధ్యమేనా? యస్.. తమిళనాడులో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
తన బ్యాంకు ఖాతాలో వంద, వెయ్యి కాదు ఏకంగా రూ 9 వేల కోట్లు జమవ్వడంతో షాక్కు గురయ్యాడు ఓ కారు డ్రైవర్. అది కలో నిజమో తెలుసుకునేందుకు వెంటనే తన స్నేహితుడి ఖాతాకు రూ 21 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. కనీసం వెయ్యి రూపాయలు కూడా లేని తన బ్యాంకు అకౌంట్లో అంత పెద్దమొత్తంలో డబ్బు రావడంతో ఆశ్చర్యపోయాడు. అయితే సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు యాజమన్యం అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే…
చెన్నైలో ఓ బ్యాంకు లో వింత 9
చెన్నైలోని పళని నెయ్క్కారపట్టి గ్రామానికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దెకు కారు తీసుకుని డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్కుమార్ తన కారులో నిద్రిస్తుండగా అతని సెల్ ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రాజ్కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ 9 వేల కోట్లు జమ అయ్యినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ మెసేజ్ చూడగానే రాజ్కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్య పోయాడు.. అంత డబ్బు తన అకౌంట్లోకి ఎలా వచ్చిందో తెలియక తికమకపడ్డాడు. అసలు 9 వేల కోట్ల రూపాయలంటే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా అతను ఊహించలేకపోయాడు.
బ్యాంకు అధికారుల నిర్వాకం వల్లే…
తన బ్యాంకు ఖాతాలో కేవలం 105 రూపాయలే ఉండగా ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చాయా? అని సందేహించాడు రాజ్ కుమార్. అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు అదే రోజు తన స్నేహితుడికి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ 21,000 ఫోన్ పే చేశాడు. ఆ డబ్బును స్నేహితుడికి పంపిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 9 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అని తేలడంతో నిజమేనని భావించి సంబరపడ్డాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి రాజ్కుమార్కు ఫోన్ వచ్చింది. ఓ పొరపాటు వల్ల అతని బ్యాంకు ఖాతాలో రూ 9 వేల కోట్లు జమ అయ్యాయని వారు తెలిపారు. ఆ డబ్బును ఖర్చు చేయవద్దని బ్యాంకు యాజమాన్యం కోరింది. తదనంతరం అతని ఖాతా నుంచి మొత్తం నగదును వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని బ్యాంకు యాజమన్యం సూచించింది. తమిళనాడు మెర్కెంటైల్ బ్యాంక్ పొరపాటు వల్ల లావాదేవీ జరిగిందని ఈ మేరకు స్పష్టం చేసింది.
వెహికల్ లోన్ ఇస్తామన్న బ్యాంకు
రాజ్కుమార్ తరఫున న్యాయవాదులు చెన్నై టీనగర్లోని బ్యాంకు శాఖకు వెళ్లి మాట్లాడారు. దీంతో రాజ్ కుమార్ తన స్నేహితుడికి అతను పంపిన రూ 21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని తెలిపారు అలాగే వాహన రుణం కూడా ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా జేబులో చిల్లిగవ్వలేని సమయంలో హఠాత్తుగా వేల కోట్లు వచ్చిపడితే బాగుండు అని కలలో అనుకుంటు ఉంటాం. ఇలాంటి మిరాకిల్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. బ్యాంకు సూచన మేరకు రూపాయికూడా ఖర్చు చేయకుండా నిజాయితీగా తిరిగి ఇచ్చినందుకు రాజ్ కుమార్ ను బ్యాంకు సిబ్బంది అభినందించారు.