టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేసులో అరెస్టు చేసినట్లు ఎట్టకేలకు సిఐడి (CID) పోలీసులు అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు ఆయనకు బీపీ, షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆయన్ను ఓర్వకల్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో విజయవాడకు తరలిస్తున్నారు. ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అరెస్టుకు తగిన ఆధారాలు, ఆరోపణలు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. తాను నేరానికి పాలపడినట్లు ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని అన్నారు. తగిన ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని చంద్రబాబు అడ్వకేట్లు అడ్డు తగలడంతో అవగాహన లేకుండా అడ్డుపడుతున్నారని డిఐజి రఘురామి రెడ్డి దురుసుగా కామెంట్ చేశారు. చంద్రబాబు నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలైనా చూపించాలని పట్టుబట్టగా అన్నింటినీ త్వరలోనే ఇస్తాం అని విచారణాధికారులు మాట దాట వేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు (CID)
కాసేపటి క్రితం ఏపీ సీఐడి (CID) పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అవకతవకలు, అక్రమాల కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లేదని అన్నారు. 2014లో ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని దీనిద్వారా 550 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందులో ఏవన్ గా చంద్రబాబును నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటే పెద్ద బూటకమంటే అందులో నకిలీ ఇన్ వాయిస్ ల ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు విచారణలో తేలిందని అన్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు 371 కోట్లు నష్టం కలిగింది. ఈసొమ్మంతా నకిలీ పేపర్ల సాయంతో విదేశాలకు మళ్లించారు.
స్కాం కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారని, ఈ మొత్తం స్కాం లో చివరి లబ్దిదారుడు కూడా చంద్రబాబేనని ఏపీ సీఐడి ఆరోపించింది. ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తే తప్ప నిజాలు బయటకు రావని ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని సీఐడీ పోలీసులు అన్నారు.మరికొద్ది గంటల్లోనే చంద్రబాబును న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. మరోవైపు తన అరెస్టు అన్యాయం, అక్రమమని చంద్రబాబు ఆక్రోశించారు.తాను ఏ తప్పూ చేయలేదని ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేస్తున్నారన్నారు. అరెస్టుకు ఆధారాలు కానీ, కారణాలు కానీ చెప్పకుండా ఎలా తీసుకు పోతారని చంద్రబాబు ప్రశ్నించారు.45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసిన చరిత్ర తనదని, తాను అవినీతి, అక్రమాలకు పాల్పడే వ్యక్తిని కాదని నిప్పులాంటి మనిషినని తెలిపారు.తెలుగు వారి ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.మాతృ భూమికి సేవ చేయకుండా ఏశక్తీ తనను అడ్డుకోజాలదన్నారు. పార్టీ శ్రేణులు సంయమనంతో, ఓపికతో ఉండాలని అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు.
గంటా అరెస్టు.. విడుదల
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావును విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.ఈ తెల్లవారుజామన ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఎండాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రాధమిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత విడిచి పెట్టారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని అందుకే ఇలా కేసులతో చెలరేగుతోందని గంటా శ్రీనివాస రావు విమర్శించారు.