న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ edtech కంపెనీ బైజూస్ కు ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయి. కంపెనీ అకౌంట్ లని తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించింది. గత నెల బైజూస్ బోర్డులోని ముగ్గురు సభ్యులతో పాటు ఓ ఆడిటింగ్ సంస్థ బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.కంపెనీ అకౌంట్ లను తనిఖీ చేసి ఆరు వారాల్లో నివేదికను అందజేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
ఒకవేళ కంపెనీ కార్యకలాపాల్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు బైజూస్ వ్యవహారాన్ని బదిలీ చేసే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.ఇటీవల నిధుల సేకరణ సమయంలో 22 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బైజూస్ కు ఈ పరిణామం కొత్త తలనొప్పి గా మారింది . కరోనా సమయంలో ఒక్కసారిగా పుంజుకున్న కంపెనీ అమెరికాకు చెందిన ఓ సంస్థతో 1.2 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందానికి సంబంధించి చర్చలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్టప్ రంగంలో ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచిన బైజూస్ వేలాది ఉద్యోగాలను తొలగించింది.ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి నిధులను సేకరించే ప్రయత్నాల్లో ఉంది ఆ సంస్థ . గత నెల సంస్థ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో బోర్డు సభ్యులు ముగ్గురు రాజీనామా చేయడం, తాజాగా కేంద్రం ఆదేశాలు కంపెనీకి ఇబ్బందికరంగా మారాయి అని చెప్పుకోవచ్చు .