(MOON)
1969లో వ్యవస్థాపితమైన ఇస్రో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో చంద్రయాన్ ఒకటి. చంద్రునిపై పరిశోధనల్లో భాగంగా ఇస్రో శాస్ర్తవేత్తలు ఇప్పటివరకూ మూడు ప్రయోగాలు నిర్వహించారు. వాటిలో మొదటిది విజయవంతమైంది. రెండోది పాక్షిక ఫలితాలనిచ్చింది. తాజాగా మూడో ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మూడు ప్రయోగాల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం..చంద్రునిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకూ నిర్వహించిన రెండు ప్రయోగాల్లో మొదటిది విజయవంతం కాగా, రెండోది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.
2008లో చేపట్టిన చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడను గుర్తించారు. దాంతో, చంద్రునిపై నీటి జాడను కనుగొన్న మొదటి దేశంగా భారత్ చరిత్ర నెలకొలిపింది. గతంలో చంద్రునిపై అమెరికా, రష్యా పలు ప్రయోగాలు నిర్వహించినప్పటికీ అక్కడ నీరు ఉన్నట్టు గుర్తించలేకపోయాయి. దాంతో, ఇస్రో పేరు ఒక్కసారిగా ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. అయితే, ఇస్రో అంతటితో ఆగలేదు. చంద్రునిపై మరిన్ని ప్రయోగాల ద్వారా అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కోసం సంకల్పించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంది. మరో ప్రయోగాన్ని చేపట్టింది. రెండో ప్రయోగానికి చంద్రయాన్ 2గా నామకరణం చేశారు.
నింగిలోకి పంపారిలా….
2019, జులై 22న చంద్రయాన్ 2ను ఇస్రో శాస్ర్తవేత్తలు నింగిలోకి పంపించారు. ఆగస్టు 20న చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 2 వాహకనౌక చేరుకుంది. చంద్రుడిపై100 కిలోమీటర్ల ఎత్తున ఆర్బిటర్ ను ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయవంతమైంది. అయితే, ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ కావడంలో విఫలమైంది. నిర్దేశించిన దానికన్నా అధిక వేగంతో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల ల్యాండర్ తోపాటు పంపిన రోవర్ పని చేయకుండాపోయాయి. ఈ ప్రయోగం విఫలం కావడంతో చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చేపట్టాలనుకున్న పరిశోధనలు నిలిచిపోయాయి. నాలుగేళ్ల విరామం తర్వాత మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది.
వైఫల్యాలనుంచి పాఠాలు… (MOON)
ఒక ప్రయోగం విఫలమైనంత మాత్రాన శాస్ర్తవేత్తలెవరూ నిరాశకు గరి కారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. వైజ్ఞానిక చరిత్ర పట్ల అవగాహన ఉన్నవారికెవరికైనా ఇది అర్థమయ్యేదే.. ఎలక్ర్టిక్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ అందుకు ఓ ఉదాహరణ. కరెంట్ బల్బును ఆవిష్కరించడానికి ముందు ఆ ప్రయత్నంలో తాను వందలసార్లు విఫలమయ్యానని ఎడిసన్ తానే స్వయంగా వెల్లడించారు. ఆ దృష్టితో చూసినపుడు ఒకటి, రెండు వైఫల్యాలు శాస్ర్తవేత్తల్ని నిరాశపరుస్తాయని అనుకోవద్దు. ఆ క్రమంలోనే ఇస్రో శాస్ర్తవేత్తలు మూడో ప్రయోగానికి సిద్ధమయ్యారు.
గత వైఫల్యాల నుంచి…
గత వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్ర్తవేత్తలు చంద్రయాన్ 3 కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్ దిగువ భాగాన్ని డిజైన్ చేశారు. ఈసారి చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ కోసం 4 కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పయిన సువిశాల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈసారి ప్రయోగంలో ఆర్బిటర్ ను పంపించలేదు. డేటా సేకరణ కోసం చంద్రయాన్ 2 సమయంలో పంపిన ఆర్బిటర్ ను ఉపయోగించుకోనున్నారు. గత ప్రయోగంలో పంపిన ఆర్బిటర్ ఇంకా పని చేస్తూనే ఉంది. చంద్రయాన్ 3 ప్రయోగంలో 2148 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1752 కిలోల ల్యాండర్, 26 కిలోల రోవర్ లను చంద్రుని వద్దకు పంపించారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జులై 14న బయలుదేరిన చంద్రయాన్ 3 వాహకనౌక ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. క్రమంగా దాని కక్ష్యను తగ్గిస్తూ ఆగస్టు 16వరకెల్లా 100 కిలోమీటర్ల ఎత్తున చంద్రుని చుట్టూ తిరిగేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి రోవర్ తో కూడిన ఆర్బిటర్ విడిపోయి సొంతంగా కక్ష్యలో తిరిగేలా సిగ్నల్స్ పంపిస్తారు. మొత్తమ్మీద 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపై దిగేలా సిద్ధం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో 70 డిగ్రీల దక్షిణ అంశాశం వద్ద ల్యాండర్ ను ల్యాండ్ చేయడానికి అనుకూల ప్రదేశాన్ని ఇస్రో శాస్ర్తవేత్తలు ఎంచుకున్నారు.
విద్యుత్ తయారీకి అదే కీలకమా? (MOON)
చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రునిపై పలు పరిశోధనలు జరిపేందుకు వీలుగా ల్యాండర్, రోవర్ లను ఇస్రో శాస్ర్తవేత్తలు రూపొందించారు. చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే ఖనిజాలు, మూలకాలకు సంబంధించిన డేటాను ఈ పరికరాలను ఉపయోగించి తెలుసుకోనున్నారు. ల్యాండర్ ను సేఫ్టీగా ల్యాండ్ చేయించగలిగితే ఆ పరిశోధనలు సాధ్యమవుతాయి. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి అక్కడి మట్టిని కొంతమేర తొవ్వడం ద్వారా ఏముందనేది తెలుసుకునేందుకు వీలవుతుంది. హీలియం 3 కోసం అన్వేషణ కూడా ఈ పరిశోధనలో కీలకమని తెలుస్తోంది. చంద్రునిపై హీలియం 3 కోసం మన దేశంతోపాటు అమెరికా, రష్యా, చైనా కూడా అన్వేషిస్తున్నాయి.
హీలియం 3ని ఉపయోగించి విద్యుత్ ను తయారు చేసుకుంటే పర్యావరణ హితంగా ఉంటుందని చెబుతున్నారు. హీలియం ఐసోటోపుల్లో ఒకటైన హీలియం 3లో 2 ప్రోటాన్లు, 2 ఎలక్ర్టాన్లు, ఒక న్యూట్రాన్ ఉంటాయి. దీనిని హైడ్రోజన్ ఐసోటోపుల్లో ఒకటైన డ్యుటీరియంతో అణు సంయోగం చేయించడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చునని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అణుధార్మిక పదార్థాలైన యురేనియం, థోరియంలాంటి వాటితో విద్యుత్ తయారీ వల్ల పర్యావరణం కలుషితం కావడంతోపాటు ప్రమాదాలు కూడా జరిగిన విషయాల్ని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
1986 , ఏప్రిల్ 26న రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంతోపాటు 2011, మార్చి 11న జపాన్ లోని ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద జరిగిన ప్రమాదాన్ని వారు ఉదహరిస్తున్నారు. చంద్రుని నుంచి హీలియం 3 సేకరించగలిగితే..భవిష్యత్ లో విద్యుత్ కోసం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఆధారపడాల్సిన అవసరముండదని భావిస్తున్నారు. చంద్రునిపై దాదాపు 11 లక్షల టన్నుల హీలియం 3 లభ్యం కానున్నదని అంచనా.. 25 టన్నుల హీలియం 3ని వినియోగించి అమెరికాకు ఓ ఏడాదికి సరిపడా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు.
బాలీవుడ్ మూవీ కన్నా తక్కువ ఖర్చే..
చంద్రయాన్ 3 ప్రయోగం విషయంలో ఖర్చు తగ్గించేందుకు వీలుగా ఇస్రో శాస్ర్తవేత్తలు తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ప్రధానంగా ఈ ప్రయోగం కోసం వినియోగించాల్సిన ఇంధనం ఖర్చును తగ్గించారు. ఇటు భూమి గురుత్వాకర్షణను, అటు చంద్రుని గురుత్వాకర్షణనూ వినియోగించుకుంటూ వెళ్లేలా వాహక నౌక ప్రయాణ మార్గాన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలో నిర్దేశించారు. చంద్రయాన్ 3 ప్రయోగం కోసం అయ్యే ఖర్చు రూ.615 కోట్లుగా అంచనా వేశారు. చంద్రయాన్ 2 ప్రయోగం కోసం రూ.978 కోట్లు ఖర్చు కాగా, తాజా ప్రయోగానికి అంతకన్నా తక్కువే కావడం గమనార్హం. చంద్రయాన్ 3 విజయవంతమైతే..చంద్రుడిపై ల్యాండర్ ను సురక్షితంగా ల్యాండింగ్ చేయగలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనున్నది. ఇప్పటికే ఈ ఘనతను సాధించిన దేశాల్లో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. అంతేగాక చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద పరిశోధనలు జరిపిన మొదటి దేశంగా రికార్డు సాధించనున్నది.
ఆల్ ది బెస్ట్ ఇస్రో…
వైజ్ఞానిక పరిశోధనల్లో కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. అయినా, ఔత్సాహిక శాస్ర్తవేత్తలు మరిన్ని పరిశోధనలు జరిపేందుకు వెనకాడకుండా ముందుకే వెళ్తారు. ఇస్రో శాస్ర్తవేత్తల్లోనూ అదే స్ఫూర్తిని మనం చూస్తున్నాం. రెండో ప్రయోగం విఫలం కాగా, దాని నుంచి కొన్ని పాఠాలు తీసుకొని మూడో ప్రయోగాన్ని మరిన్ని జాగ్రత్తలతో చేపట్టారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కోసం మరిన్ని ప్రయోగాలు చేపట్టాల్సి ఉంది. అందుకు ఇస్రోకు అవసరమైన నిధుల్ని రానున్న ప్రభుత్వాలు కూడా అందిస్తాయని ఆశిద్దాం. (MOON)