మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ చేరికతో ప్రభుత్వం బలోపేతం అవుతుందని భావిస్తే అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. శివసేన నుంచి షిండే వర్గంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగలి పోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తిరిగి శివసేన వైపు చూసేందుకు వారు ఉన్నారన్న వార్తలు అధికార కూటమిని ఇబ్బంది పెడుతున్నాయి. మహారాష్ట్రలో కమలం పార్టీ వేసిన ఎత్తుగడ వికటించేదిలా ఉంది. ఇన్నాళ్లూ బీజేపీ, షిండే వర్గం కలసి పోయి పాలన సాగిస్తుంది. అయితే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ రాకతో కొంత అలజడి మొదలయింది. అజిత్ ను వ్యతిరేకించే వారు షిండే గ్రూపులో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
అనర్హత వేటు పడితే…?
ఏక్ నాథ్ షిండే వెంట వచ్చిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానం అనర్హత వేటు వేస్తుందేమోనని భయపడి ముందుగానే అజిత్ పవర్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోగలిగారు. అజిత్ పవార్ ఇప్పటికే ఐదు సార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహించారు. శరద్ పవార్ కు అత్యంత సన్నిహితులు కూడా ఎన్సీపీ నుంచి బయటకు రావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది శరద్ పవార్ ఆడిస్తున్న నాటకమా? లేక ప్రభుత్వంలో కోవర్టులుగా వారు వచ్చి చేరారా? అన్న డౌటు సహజంగా ఎవరికైనా కలుగుతుంది. షిండే వర్గంలో రేగిన అలజడితో ఏక్ నాథ్ షిండేతో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ నిన్న రాత్రి చర్చలు జరిపారు. అసంతృప్త ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాల్సిందిగా సూచించారు.
సీఎం ఎవరు?
షిండే వర్గానికి చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ రాకతో తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం కూటమిలో కలవరం రేపింది. అయితే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ముందుగానే షిండే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో నేడు భేటీ కానున్నారని తెలిసింది. అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారన్న వార్తలు కూడా ఏక్ నాథ్ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. షిండేతో సహా పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం మహారాష్ట్ర్ర పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరు తిరిగి వచ్చినా తాము ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చేర్చుకుంటామని సంకేతాలు పంపుతుంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Follow Us On : YouTube , Google News