అడవుల్లో ఉండాల్సిన జంతువులు నివాసిత ప్రాంతాలకు తరలి వస్తున్నాయి. అడవిలో నీళ్లు, ఆహారం దొరకకపోవడంతో చిరుతలు, ఏనుగులు గ్రామాల మీద పడుతున్నాయి. అందిన కాడికి తింటున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలోని ప్రజలు చిరుతల రాకతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట తండాలోకి ఒక చిరుత ప్రవేశించింది. అర్థరాత్రి పన్నెడు గంటల సమయంలో శ్రీరామ్ నాయక్, వల్లీ నాయక్ ఇంటి సమీపంలో ఉన్న మేకల గుంపుపై దాడి చేసింది.
మేకలపై దాడి…
చిరుత ఈ దాడిలో రెండు మేకలను చంపి తినింది. దీంతో దిగువమెట్ట తండా వాసులు భయపడి పోతున్నారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు పంపారు. పాదముద్రలను బట్టి చిరుత గ్రామంలోకి ప్రవేశించిందని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. చిరుతను పట్టుకోవడం కోసం బోనులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, రాత్రివేళలలో బయటకు రావద్దని గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు సూచించారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Follow Us On : YouTube , Google News