ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఈసారి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చెప్పుకుంటారు. తెలంగాణ జాతి పితగా ఆయనను గులాబీ పార్టీ నేతలు చెబుతుంటారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే వారు కోకొల్లలు. ఆయనకు రెండు దఫాలుగా ఎదురు లేదు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన సునాయాసంగా గెలిచారు. బంగారు తెలంగాణను సాధించే దిశగానే తాను అధికారంలోకి మరోసారి రావాలని, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే మరలా ఆగం అయిపోతుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. జనాలకు కూడా అదే పిలుపు నిస్తున్నారు.
గట్టి పోటీ అనా?
అయితే 2014, 2018 ఎన్నికల మాదిరి వచ్చే ఎన్నికలుండవన్న సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. ఈసారి గట్టి పోటీ ఎదుర్కొనక తప్పదన్న విషయమూ ఆయనకు తెలుసు. ప్రతర్థులు బలోపేతం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశమిస్తే ఏం పోయిందన్న వారి సంఖ్య క్రమంగా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి సహాయ సహాకారాలు అందడం లేదు. ఆర్థికంగా ఇప్పటికే అన్ని రకాలుగా నష్టపోయినా ఎన్నికల కోసమే ప్రభుత్వ భూములను అమ్మి తాను గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలు కూడా బూమ్ రంగ్ అయ్యే అవకాశాలు సుస్పష్టం.
గతంలో ఎన్నడూ లేని విధంగా… (KCR)
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నిజానికి కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గంపా గోవర్థన్ 2009 నుంచి మొన్నటి 2018 ఎన్నికల వరకూ విజయం సాధించారు. అయితే ఆయన స్థానంలో కేసీఆర్ పోటీ చేయడానికి కారణాలపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. గత కొంత కాలం నుంచి కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయాలని పదే పదే కోరుతున్నారు. ఆయన కోరిన మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఇవే కారణాలట…
గతంలో గజ్వేల్ కు మాత్రమే పరిమితమయిన కేసీఆర్ కామారెడ్డిని కూడా ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ కేసీఆర్ తల్లి పుట్టిన ఊరు. దీంతో పాటు గంప గోవర్థన్ పై కొంత అసంతృప్తి ఉంది. దీంతో పాటు గజ్వేల్ లో ఈసారి ఈటల రాజేందర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈటల గజ్వేల్ లో పోటీ చేస్తే కేసీఆర్ గెలుపునకు ఢోకా ఉండకపోవచ్చు కానీ చివరి నిమిషం వరకూ టెన్షన్ పడాల్సిందే. ఈ పరిస్థితుల్లోనే ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డిని కూడా ఎంచుకోవడంలో పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్తగానే ఆయన రెండు చోట్ల పోటీకి దిగుతున్నారన్నది కాదనలేని వాస్తవం. రెండు చోట్ల గెలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నియోజకవర్గాలను ఎంచుకోవడంపై కేసీఆర్ పైకి చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవన్నది విపక్షాల నుంచి విమర్శ. బలహీనంగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పార్టీ అభ్యర్థులు గెలవాలన్నా, తన పోటీతో కొంత పాజిటివ్ టర్న్ తీసుకుంటుందని ఆయన భావించే కామారెడ్డిని ఎంచుకున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. (KCR)