(Assembly)
ఈసారి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటానికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తుంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పాటు ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫలం కావడం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు రెండుసార్లు పక్కన పెట్టారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ పక్షాన నిలబడ్డారు. కేసీఆర్ ఉద్యమం కారణంగానే తెలంగాణ వచ్చిందన్న వాదనలో ఎంత నిజముందో.. కాంగ్రెస్ కూడా అదేస్థాయిలో తాము ఆంధ్రప్రదేశ్ లో నష్టపోతామని తెలిసీ రాష్ట్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రజల్లోకి బలంగా ఇక్కడి నేతలు తీసుకెళ్లలేకపోయారు.
రెండుసార్లు తిరస్కరించడంతో…
దీంతో రెండుసార్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రెండుసార్లు అధికార పార్టీవైపు వెళ్లిపోవడంతో ఆ పార్టీపై జనం నమ్మకం సడలింది. వీరిని గెలిపించినా ఫలితం లేదన్న నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో హస్తం పార్టీ పడింది. అందుకోసం అభ్యర్థుల నుంచి ముందుగానే ప్రమాణ పత్రాన్ని తీసుకుంటుంది.
తాము గెలిచినా ఇతర పార్టీల్లోకి మారబోమని ఆ ప్రమాణ పత్రంలో అభ్యర్థుల సంతకాలతో తీసుకోవాలని నిర్ణయించింది. ఇది పూర్తి స్థాయిలో పని చేయక పోయినా ఎంతో కొంత వెళ్లే వారిని ఆపుతుందన్న నమ్మకంతో పాటు ప్రజల్లో కూడా ప్రమాణపత్రం ఇచ్చి పార్టీ మారారన్న అపప్రధను జంప్ జిలానీలు కొని తెచ్చుకునే అవకాశముంది.
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్…
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఈసారి లోక్ సభ కంటే శాసనసభ ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పేరున్నే నేతలతో పాటు ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేతలంతా ఈసారి శాసనసభకు పోటీ చేయాలని నిర్ణయించారు.
ఇందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.శాసనసభకు పోటీ చేసి ముందుగా రాష్ట్రంలో పాగా వేయగలిగితే ఆ తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికలకు ఎక్కువ స్థానాలను దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యులతో పాటు ముఖ్యనేతలందరూ అసెంబ్లీ (Assembly) బరిలోనే నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వారికి నియోజకవర్గాల్లో పట్టుండటంతో గెలుపు సులువవుతుందని, ప్రస్తుత అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే సీనియర్ నేతలంతా శాసనసభకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
వీరంతా అసెంబ్లీకే… (Assembly)
అందులో భాగంగానే పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారు.
ఈ మేరకు ఆ యా నియోజకవర్గాలకు టిక్కెట్ల కోసం దరఖాస్తులు కూడా చేసుకున్నారు.హైైకమాండ్ కూడా కాదనే పరిస్థితి లేదు. వచ్చే లోక్ సభ ఎన్నికలను పక్కన పెట్టి ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్న కాంక్ష కనపడుతుంది. దీంతో పాటు నాయకులు కూడా ఐక్యత కనపర్చేలా అధినాయకత్వం ఇప్పటికే క్లాస్ పీకింది. కర్ణాటక తరహాలో అందరూ ఏకమైతేనే గెలుపు సాధ్యమవుతుందని చెప్పి పంపింది. మొత్తం మీద అసెంబ్లీ సీట్ల వైపు సీనియర్ నేతలందరూ మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్ లో నవతరం, కొత్తగా ఆశావహుల్లో కొంత నిరాశ కనిపిస్తున్నా గెలుపే లక్ష్యంగా వారు బరిలోకి దిగుతున్నారని తెలిసింది.