కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ కొంత వ్యూహాన్ని మార్చుకుంది. తెలంగాణలో ఇప్పటికే పదేళ్ల నుంచి అధికారంలో లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని ప్రజలు పక్కన పెట్టకపోవడానికి పార్టీ నేతలపై నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఐక్యత లేదని, కాంగ్రెస్కు అధికారాన్ని ఇస్తే రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందని ప్రజలు భావించి రెండోసారి కూడా గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఈసారి తెలంగాణ కాంగ్రెస్ కొత్త అడుగులు వేయాలనుకుంటుంది. కన్నడ నాట తరహాలో ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు ఐక్యతగా కనిపించడం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.
ఐక్యత కోసం…
గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికార బీఆర్ఎస్ వైపు వెళ్లారు. కాంగ్రెస్కు ఓటు వేసినా కారు పార్టీవైపు వెళతారన్న అపప్రధను ఆ పార్టీ తొమ్మిదేళ్ల నుంచి మూటగట్టుకుంది. దీన్నుంచి బయటపడేందుకు నేతలందరూ ఏకమవుతున్నారు. బస్సు యాత్ర పేరిట త్వరలో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాము ఐక్యంగా ఉన్నామని ప్రజల ముందు ప్రదర్శన చేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కర్ణాటకలోనూ ఎన్నికలకు ముందు నేతలందరూ ఏకమై యాత్ర చేపట్టిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.
కమీషన్ల ప్రభుత్వ….
దీంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను తీవ్రతరం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రభుత్వం కారణంగా కేవలం కొందరే ప్రయోజనం పొందుతున్నారని, సమాజానికి జరుగుతున్న నష్టాన్ని వివరించే దిశగా బస్సు యాత్ర సాగనుంది. కర్ణాటకలో ముప్ఫయి శాతం కమీషన్ నినాదం బాగా పనిచేసింది. ఇక్కడ కూడా ప్రతి పనికీ నలభై శాతం కమిషన్ లు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారన్నది ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
ఈసారి ఛాన్స్…
ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకంలోనూ ముప్ఫయి నుంచి నలభై శాతం కమీషన్లను ఎమ్మెల్యేలు దండుకుంటున్నారని, వారిని ఈసారి తిరస్కరించాలని యాత్ర ద్వారా పార్టీ నేతలు పిలుపునివ్వనున్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని బస్సుయాత్రలో కోరనున్నారు. ఈ కమీషన్ సర్కార్ ను గద్దె నుంచి కిందకు దింపితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న నినాదాన్ని ప్రజల మనసులో చొప్పించే ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. మరి వీళ్లు ఎంత వరకూ సక్సెస్ అవుతారు? అన్నది కాలమే తెలియజెప్పాల్సి ఉంది.