గెలుపుపై ధీమాలో ఉన్న తెలంగాణ (TS) కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఈసారి గెలుపు గ్యారంటీ అని సర్వేలు చెప్పడం, మరోవైపు జనంలో కాంగ్రెస్ వేవ్ వచ్చేసిందని రేవంత్ లాంటి సీనియర్ల ప్రచారంతో ఆపార్టీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవల బీఆర్ఎస్ లో టిక్కెట్లు దక్కని వాళ్లంతా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. అదీ సాదా సీదాగా కాదు. ఏకంగా మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లడం. ఈవినింగ్ రాహుల్, సోనియా,ప్రియాంక ఎవరో ఒకరి సమక్షంలో కండువా కప్పేసుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి గెలుపు గుర్రంలా కనిపిస్తున్న ఆ పార్టీలోకి అందుకే వలసలు పెరిగాయి.
అధికార టీఆర్ ఎస్ పార్టీలో టిక్కెట్లు రానివారు కేసీఆర్ దయా దాక్షిణ్యాలు కరువైన వారు ఏ మాత్రం నిరాశపడకుండా మూడు రంగుల జెండావైపు చూసేస్తున్నారు. మల్కాజ్ గిరిలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు కి కూడా టిక్కెట్ అడిగారు. కుదరదని కారు పార్టీ తేల్చేయడంతో ఆయన పార్టీ మారిపోయారు. అయితే ఆలసించిన ఆశాభంగము అనుకుందేమో కాంగ్రెస్ కూడా వచ్చిన వారికి వచ్చినట్లు వాళ్ల ముఖమైనా చూడకుండా కండువాలు కప్పేస్తోంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు రెండు టిక్కెట్ల హామీతోనే కాంగ్రెస్ లో చేరారు. అయితే మైనంపల్లిని చూసి ఇప్పుడు మిగతా వారు కూడా డిమాండ్ చేయడం మొదలు పెడుతున్నారు.
వన్ ప్లస్ వన్…వన్ ప్లస్ టూ డిమాండ్ (TS)
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకూ, తన భార్య పద్మావతికి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక జానారెడ్డి తనకు ఎంపీ టిక్కెట్ తో పాటు తన ఇద్దరు కొడుకులకీ ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలంటున్నారు. జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాల గూడ టిక్కెటు కావాలంటున్నారు జానా. ఇక మల్లువి తన కొడుకుకి టిక్కెట్ కోరుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతులు ఏకంగా మూడు టిక్కెట్లు అడుగుతున్నారు. వాళ్లిద్దరితోపాటు కుమార్తె సుస్మిత కూడా ఈ సారి పోటీ చేస్తుందంటున్నారు. ఇక పీజేఆర్ కుటుంబంలో కూడా టిక్కెట్ల డిమాండ్ ఉంది మాజీ ఎమ్మెల్యే విష్ణు, కార్పొరేటర్ విజయ కూడా ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క తన తో పాటు తన కొడుకు సూర్యకి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.మరో సీనియర్ నేత బలరాం నాయక్ తనతో పాటు, తన కొడుకు సాయిశంకర్ నాయక్ కు, మల్ రెడ్డి రంగారెడ్డి తన కొడుకు అభిషేక్ రెడ్డికి టిక్కెట్ కావాలని అడుగుతున్నారు.
ఇక మరో ఇద్దరు సీనియర్లు దామోదర రాజనరసింహా, అంజన్ కుమార్ యాదవ్ కూడా తమ బిడ్డలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలంటున్నారు.ఇక మరో నేత శ్యామ్ నాయక్ తనతో పాటు తన భార్య రేఖ నాయక్ కు కూడా టిక్కెట్ కావాలంటున్నారు.ఇలా మొత్తం మీద అందరూ రెండేసి టిక్కెట్లు అడిగేస్తున్నారు. ఇదంతా మైనంపల్లితోనే మొదలైంది. అసలే కాంగ్రెస్ ను, బీఆర్ ఎస్ ను వంశపారం పర్యపాలన అని మోడీ ప్రతీ మీటింగ్ లోనూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఇంత మందికి వారు అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వడం అసాధ్యం.. ఒకవేళ అలా ఇస్తే పార్టీ పరువు గంగలో కలిసేలా ఉంది. టిక్కెట్లు ఇవ్వకపోతే మన జంపింగ్ జపాంగ్ లు మళ్లీ ఇంకో పార్టీలోకి గెంతేసే అవకాశాలూ ఉన్నాయి. మైనంపల్లి వచ్చినదే ఆ డిమాండ్ తో..ఇప్పుడు మైనంపల్లికి నిరాశ దక్కితే ఆ పరిణామాలు ఇతరులపైనా పడతాయ్. చేరికలు బానే ఉన్నాయి.. కానీ టిక్కెట్ల లొల్లి ఏంటా అని కోర్ కమిటీ తలలు పట్టుకుంటోంది.
ఉదయ పూర్ డిక్లరేషన్ సాధ్యమేనా?
వారసులకు టిక్కెట్లు ఇచ్చుకుంటూపోతే కాంగ్రెస్ ఉదయ్ పూర్ చింతన్ బైఠక్ లో చేసిన తీర్మానానికి గండి కొట్టినట్లే.. ఉదయ్ పూర్ తీర్మానంలో ప్రతీ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో రెండు బీసీలకు ఇవ్వాలని ఆ తీర్మానంలో నిర్ణయించారు. అయితే ఇప్పుడు కుటుంబం నుంచి ఇద్దరు,ముగ్గురు బరిలో ఉంటే బీసీలకు సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు.మరి ఈ తలనొప్పిని హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో? (TS)