ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరిని పార్టీ నాయకత్వం నియమించింది. సోము వీర్రాజు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని నియమిస్తూ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. పురంద్రీశ్వరి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి పార్టీలో ఆమెకు అనేక పదవులు అధినాయకత్వం కల్పించింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె నియామకాన్ని ఎవరూ ఊహించలేదు.
ఎవరిని దెబ్బతీసేందుకు…?
పురంద్రీశ్వరికి కేంద్ర పార్టీలో ప్రాధాన్యం ఉంది కాబట్టి ఆమెకు రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలు ఉండబోవని అంచనా వేశారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం పురంద్రీశ్వరిని ఎంపిక చేయడం మాత్రం పార్టీలోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు ఈ నియామకం అనుకూలమా? వ్యతిరేకమా? అన్న చర్చ నడుస్తోంది. ఒకే సామాజికవర్గం కావడంతో పాటు ఎన్టీఆర్ కుమార్తె కావడంతో టీడీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడానికే చిన్నమ్మను నియమించారన్న వాదన కూడా లేకపోలేదు.
అనుకూలమా?
అయితే మరో వాదన కూడా ఉంది. సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. బీజేపీలో ఒకవర్గం నేతలు సోము వీర్రాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సోము వీర్రాజు తన టీంతో రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకే కొత్తగా పురంద్రీశ్వరిని నియమించారని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పురంద్రీశ్వరి నియామకం ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు.
తెలంగాణలోనూ…
తెలంగాణలోనూ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించారు. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఆయన స్థానంలో లక్ష్మణ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలున్నాయంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు మాత్రం కొంత సంచలనమే అనిచెప్పాలి. ఎన్నికల వేళ తీసుకున్నఅధినాయకత్వం తీసుకున్న ఈనిర్ణయం బీజేపీకి ఏ మేరకు లాభిస్తుందన్నది చూడాల్సి ఉంది.