టమాటా ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. తగ్గకపోగా పెరుగుతున్నాయి. కిలో టమాటా మూడు వందల రూపాయలకు చేరుకుంటుంది. భారీ వర్షాలు, వరదలు, దిగుబడి తగ్గడంతో టమాటా ధరలు పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అలాంటి టమాటాతో విచిత్రమైన విషయాలు రోజూ చూస్తున్నాం. ఇంట్లో దొంగలు పడి బంగారంతో పాటా టమాటాలు ఎత్తుకెళుతున్నారు. టమాటా లోడున్న లారీలను హైజాక్ చేస్తున్నారు. అలాగే టమాటా వ్యాపారులు బౌన్సర్లను రక్షణగా పెట్టుకున్న వార్తలు కూడా చూశాం.
కుమార్తెకు..
వాటికి మించి విచిత్రమైన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారికి భక్తులు కానుకలను సమర్పించుకుంటారు. కొందరైతే తమ కోరికలు నెరవేరితే తులాభారం ఇస్తామంటూ అమ్మవారికి మొక్కుకుంటారు. తమ కోరికలు నెరవేరిన వెంటనే తులాభారంతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపి వెళుతుంటారు. అయితే అనకాపల్లికి చెందిన ఒక భక్తుడు టమాటాలతో తులాభారం వేసిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది.
51 కేజీలు…
అనకాపల్లికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు నూకాలమ్మ ఆలయంలో తులాభారం జరిగింది. అయితే ఈ తులాభారం టమాటాలతో జరిగింది. 51 కేజీల టమాటాలతో తులా భారం వేశారు. కిలో టమాటా 120 రూపాయలు పలుకుతున్న ఈ సమయంలో 51 కిలోలను తులాభారం వేయడమంటే మాటలా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ టమాటాలను అమ్మవారి ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి వినియోగిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిచ్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.