తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని తెలిపింది. దీంతో ఎన్నికలకు ఇంకా మరికొద్ది నెలల సమయం ఉండగానే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడటం ఇప్పుడు పార్టీలోనూ, తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది.
తప్పుడు అఫడవిట్…
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.
ఐదు లక్షల జరిమానా…
దీనిపై విచారించిన హైకోర్టు వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫడవిట్ సమర్పించినందుకు ఐదు లక్షల జరిమానాను విధించింది. డిసెంబరు 12 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ లో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు తర్వాత బీఆర్ఎస్ లో అధికారికంగా చేరిపోయారు. ఇప్పుడు అనర్హత వేటు పడటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.