తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం కష్టపడి పని చేసిన వారిని పక్కన పెడుతున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఈ అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి కొందరు బహిరంగంగానే నిరసనలకు దిగుతుండటం గులాబీ పార్టీలో ఆందోళనకు గురవుతుంది.
అసంతృప్తులను…
ఈ అసంతృప్తులను పారదోలేందుకు మంత్రులు సయితం రంగంలోకి దిగుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం బాధ్యతను ఒక్కో మంత్రికి కేసీఆర్ అప్పగించారు. వాటిని పరిష్కరించి నియోజకవర్గంలో మరోసారి కారు పార్టీ గెలుపునకు అందరూ కృషి చేయాలని కేసీఆర్ కోరుతున్నారు. మరో వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం అసంతృప్త నేతలతో మాట్లాడుతూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నేరుగా తనను వచ్చి కలసి సమస్యలను చెప్పుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ ఎన్నికలు కీలకమని, తెలంగాణను నిలబెట్టుకోవడానికి మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం ముఖ్యమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు చెబుతున్నారు.
సగం మంది…
ఇదిలా ఉండగా మంత్రుల్లో ఎక్కువ మంది ప్రజల నుంచి అసంతృప్తికి గురవుతున్నారు. ఎన్నికల వరకూ పరిస్థితి ఇలానే ఉంటే దాదాపు సగం పైగా మంత్రులు రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టమన్న అంచనాకు గులాబీ బాస్ వచ్చినట్లు తెలిసింది. అందుకే సర్వే నివేదికలను మంత్రుల ముందు బట్టి జాగ్రత్తపడాలని కేసీఆర్ వారికి సూచిస్తున్నారు. మరో రెండు నెలల్లో పనితీరు మార్చుకోకుంటే మంత్రిని అని కూడా చూడకుండా అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటిస్తానని కేసీఆర్ కొందరికి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. దీంతో మంత్రుల్లో అలజడి మొదలయింది. మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తర్వాత కొందరు హైదరాబాద్ కే పరిమితమవుతూ నియోజకవర్గాలను పూర్తిగా గాలికి వదిలేశారు.
నియోజకవర్గానికి దూరంగా…
మంత్రిని కలవాలన్నా ముఖ్యమైన కార్యకర్తలకు కూడా కష్టంగా మారింది. ఈటల రాజేందర్ ను మంత్రి పదవినుంచి తొలగించిన తర్వాత విస్తరణ ఉంటుందని భావించినా తర్వాత కేసీఆర్ ఎటువంటి విస్తరణ చేపట్టలేదు. దీంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులకు అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు కేసీఆర్ గుర్తించారు. వీరు జాగ్రత్తపడక పోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని నేరుగానే వారితో చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పది మంది మంత్రుల పనితీరు బాగాలేదని కూడా గులాబీ దళపతి ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిని పక్కన పెట్టకపోతే అసలుకే ఎసరవుతుందని భావిస్తున్నారు. అందుకే మంత్రుల్లో సగం మందికి ఈసారి సీట్లు దక్కే అవకాశాలు లేవన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి కేసీఆర్ వార్నింగ్ లకు వారు తమ పని తీరుసరిచేసుకుంటారా? లేదా?అన్నది చూడాలి.