ఎన్నికలకు ముందు ఏమి చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెనువెంటనే నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారు. హామీలను విశ్వసించే ఓట్లు వేస్తారు. అది చేయకపోతే తర్వాత ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదు. రాజకీయాల్లో పార్టీ అధినేతలకు ప్రజల్లో విశ్వాసం ఉండటం ముఖ్యం. అందునా అధికారంలో ఉన్న పార్టీకి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం అనేక రాష్ట్రాల్లో చూస్తుంటాం. హామీలకు అంత పవర్ ఉంటుంది.
ఎన్నికలకు ముందు…
అయితే ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను హడావిడిగా అమలు చేసినా ఎంతవరకూ ప్రయోజనం ఉంటుందన్నది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే తేలుతుంది. 2014 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతు రుణ మాఫీ చేస్తానని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తామని తెలిపారు. అయితే ఆయన నాలుగున్నరేళ్లలో ఆయన హామీలను అమలు పర్చలేదు. చూస్తుండగానే 2019 ఎన్నికలు వచ్చాయి. దీంతో చంద్రబాబు సర్దుకున్నారు. అప్పటికప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేయకున్నా పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయల నగదును వారి అకౌంట్లలో చంద్రబాబు జమ చేశారు.
పసుపు కుంకుమ…
కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో కేసీఆర్ ఎన్నికలు ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉన్న తరుణంలో ఎన్నికల హామీలను లైవ్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మొదటిది రైతు రుణమాఫీ. గతంలో యాభై వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికే మాఫీ చేసిన ప్రభుత్వం నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందలేదని చెబుతుంది. రైతాంగం దానిని సాకుగా చూస్తారా? లేక నిజంగానే కేసీఆర్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి తమకు రుణమాఫీ చేయలేదని భావిస్తారా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.
రుణమాఫీకి…
నాలుగున్నరేళ్లు కావడంతో అనేక మంది రైతులు తాము చెల్లించాల్సిన రుణాలను బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకు అధికారుల నుంచి వత్తిడి పెరగడంతో చాలా మంది వరకూ రుణమాఫీ చేశారు. కొత్తగా కూడా రుణాలు తీసుకున్నారు. 2018లో ఇచ్చిన హామీని కేసీఆర్ ఇప్పుడు అమలు పరుస్తుండటంతో అది ఏమేరకు గులాబీ పార్టీకి అనుకూలమవుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఇచ్చిన పసుపుకుంకుమతో కొందరు సోషల్ మీడియాలో పోలుస్తూ అధికార బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. పసుపు కుంకుమలా ఏపీలో తేలిపోయినట్లు తెలంగాణలోనూ రుణమాఫీ తేలిపోతుందా? అన్న భయం కూడా కారు పార్టీ నేతల్లో ఉంది. మరి ఏం జరుగుతుందన్నది తెలియాలంటే ఎన్నికల కౌంటింగ్ వరకూ ఆగాల్సిందే.