ఏసీబీ (ACB) అధికారులు ట్రాప్ చేశారంటే అడ్డంగా దొరికిపోతారు. అంత పకడ్బందీగా వ్యవహారం సాగుతుంటుంది. ఏసీబీ అధికారుల పన్నిన ఉచ్చులో పడకుండా సామాన్యంగా ఎవరూ తప్పించుకోలేరు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులు ఎక్కువయ్యాయి. ప్రజల నుంచి కూడా నేరుగా ఫిర్యాదులు అందడంతో అధికారులు ఏసీబీ ట్రాప్ లో చిక్కుకుంటున్నారు. అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అనేక మందిని అవినీతి కేసుల కింద బుక్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ ఒక అధికారి మాత్రం ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకున్న ఘటన ఏపీలో జరిగింది.
జూనియర్ ఇంజనీర్ ను…
విజయనగరం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో శాంతారామ్ జూనియర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనపై ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. డబ్బులు తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నంలో శాంతారామ్ జంప్ అయ్యాడు. ఇక ఏసీబీ అధికారులకు దొరకనే లేదు. దీంతో పోలీసులతో పాటు ఏసీబీ అధికారులు సయితం శాంతారామ్ కోసం గాలిస్తున్నారు. కానీ వారి చర్యలు మాత్రం ఇప్పటి వరకూ ఫలించలేదు. ఏసీబీ పక్కాగా ట్రాప్ చేసినా శాంతారామ్ తప్పించుకోవడంపై ఏసీబీ ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేస్తున్నారని తెలిసింది.
లంచం డిమాండ్ చేసి… (ACB)
విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ములక్కాయవలస గ్రామానికి చెందిన రైతు ఈశ్వరరావు తన వ్యవసాయ పంపు సెట్ కు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు కనెక్షన్ ఇవ్వాలంటూ నాలుగు వేల రూపాయలు ఈపీడీసీఎల్ లో ఈశ్వరరావు డిపాజిట్ చేశాడు. కానీ కనెక్షన్ ఇచ్చేందుకు మాత్రం జేఈఈ శాంతారామ్ ఈశ్వరరావును అరవై వేలు డిమాండ్ చేశాడు. అయితే ఇందుకు అంగీకరించిన ఈశ్వరరావు తొలుత ఇరవై వేల రూపాయలు చెల్లించాడు. మిగిలిన నలభై వేలు ఇవ్వాలంటూ ఈశ్వరరావుపై శాంతారామ్ వత్తిడి తెస్తున్నాడు. ఇది తట్టుకోలేని రైతు ఈశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తనను జేఈఈ శాంతారామ్ వేధిస్తున్న విషయం పూసగుచ్చినట్లు తెలిపాడు. దీంతో ఏసీబీ అధికారులు శాంతారామ్ ను ట్రాప్ చేసేందుకు సిద్ధమై అందుకు సమయం, స్థలం కూడా చెప్పారు.
సొమ్మును విసిరేసి…
నలభై వేల రూపాయల కోసం శాంతారామ్ నిన్న రాత్రి ములక్కాయవసల గ్రామానికి వచ్చాడు. కారులో వచ్చిన శాంతారామ్ రైతు ఈశ్వరరావు నుంచి నలభై వేలు లంచం తీసుకున్నాడు. అయితే కారులో ఉన్న శాంతారామ్ ను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించగా కారులో నుంచి తాను తీసుకున్న డబ్బును పొలంలో విసిరేసి పారిపోయాడు. కానీ ఏసీబీ అధికారులు ద్విచక్ర వాహనంపై జేఈఈ శాంతారామ్ కారును వెంబడించారు. కానీ పట్టుకోలేకపోయారు. బైక్ ను ఢీకొట్టడంతో ఏసీబీ అధికారి ఒకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శాంతారామ్ ఎక్కడ ఉన్నదీ తెలియరాలేదు. ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు మొహరించారు. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తృటిలో తప్పించుకున్న శాంతారామ్ ఎక్కడకు వెళ్లారన్నది తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. (ACB)